TS Congress : గ్రామపంచాయతీల నిధుల మళ్లింపు, సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలను అరెస్టు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించేందుకు సిద్ధమైన కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బొల్లారం పీఎస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు  ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా గృహనిర్బంధాలు చేస్తూ అరెస్టులు చేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచుల నిధుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేయడం సిగ్గుచేటని అన్నారు. బొల్లారం పీఎస్ ను కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. పీఎస్ లోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 


అక్రమ అరెస్టులపై కోర్టును ఆశ్రయిస్తాం - జీవన్ రెడ్డి 


గ్రామ పంచాయతీల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలన  నైజాం పాలనను మించిపోయిందని విమర్శించారు. పోలీసులపై చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. మందస్తు అరెస్టుపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను గ్రామపంచాయతీలకు జమ చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఐపీసీ 353 సెక్షన్ కింద శిక్షార్హులవుతారని హెచ్చరించారు. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులను పంపిణీ చేయకుండా కేంద్రం ఇస్తున్న నిధులను పంచాయతీల అనుమతి లేకుండానే మళ్లించారని ఆరోపించారు. 3 నెలలుగా ట్రేజరీలో చెక్కులు నిలిపివేసి, గ్రామ పంచాయతీల నిధులు మళ్లించారని ద్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన నిధులు గ్రామ పంచాయతీలకు తిరిగి జమ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. 


గ్రామపంచాయతీల నిధులు మళ్లింపు 


తెలంగాణలోని 12,700 గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ దారిలో ఇతర శాఖలకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ  ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు  ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతోపాటు కాంగ్రెస్ నాయకులను సోమవారం తెల్లవారుజామున నుంచే హౌస్ అరెస్టులు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో పాటు అనేక మంది ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధాలు చేయడంతో టీపీసీసీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని సర్పంచ్ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ఇందిరాపార్కుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.  


కాంగ్రెస్ నేతలు ఆగ్రహం 


పోలీసు తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన విధులను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని, ఇలాగే నిర్బంధాన్ని కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం సర్పంచుల డిమాండ్ల పరిష్కరించకపోవడం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ తీవ్రంగా మండిపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,  వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్,  సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి,  సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్, రేణుక చౌదరి, సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి, మల్లు రవి, పొన్నం ప్రభాకర్ పోలీసుల తీరును తీవ్రంగా ఎండగట్టారు.