Students Protest : విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇలాకాలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల  విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్ ఇక్కడికొచ్చి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ  సమస్యలపై అధికారులు స్పందించడంలేదని విద్యా్ర్థులు ఆరోపిస్తున్నారు. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 400 మంది విద్యార్థినిలు ఉంటే కేవలం ఒకే ఒక వాష్ రూమ్ ఉందని, ఆ వాష్ రూమ్ లో కూడా ఎలాంటి సదుపాయాలు లేవని ఆవేదన చెందారు. 300 మంది బాయ్స్ కు వాష్ రూమ్స్ లేవన్నారు. కళాశాలకు వచ్చిన తర్వాత వాష్ రూమ్ రాకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



ఒక్క నెలలో పరిష్కరిస్తామంటే ఎలా నమ్మాలి


నాలుగు సంవత్సరాలలో పరిష్కరించని సమస్యను ఒక్క నెలలో పరిష్కరిస్తామంటే ఎలా నమ్మాలంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించలేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.పదివేల రూపాయలతో వాటర్ ట్యాప్ లను రిపేరు చేస్తే  కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపారు సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. 


బాసర ట్రిపుల్ ఐటీలో మరో వివాదం 


బాసర ట్రిపుల్ ఐటీలో మరో వివాదం రాజుకుంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ క్యాంపస్‌లో రెండు సార్లు పర్యటించి సమస్యలను కాస్త చక్కదిద్దారని ఊరట చెందే లోపే ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అక్కడ సంచలనంగా మారింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ 2 చదువుతున్న భాను ప్రసాద్ అనే విద్యార్థి సూసైట్‌ నోట్ రాసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విద్యార్థి గతంలోనూ ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అప్పట్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి మృతి నేపథ్యంలో అధికారులు బాసర ట్రిపుల్ ఐటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, విద్యార్థులంతా కలిసి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు నిరసనకు దిగారు. ఫ్యాకల్టీ ఒత్తిడి వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బాసర ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. భాను ప్రసాద్ స్వస్థలం  రంగారెడ్డి జిల్లా మంచెల్‌ మండలం రంగాపూర్ గ్రామం.


ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత


ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని నిర్మల్ జిల్లా ఆసుపత్రిలోకి బీజేపీ, ఏబీవీపీ నాయకులు చొచ్చుకెళ్ళారు. భాను ప్రసాద్ మరణం పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్ళిన బీజేపీ నాయకులను, ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.