Sai Chand Death: అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ మృతితో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ సాయి చంద్.. పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ ను చూడగానే ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా..." సార్ సాయిని పిలువండి. లెమ్మనండి..మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్.." అంటూ సాయింద్ భార్య రజినీ హృదయ విదారకంగా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. దగ్గరకు వచ్చి రోధిస్తున్న సాయిచంద్ తండ్రిని సీఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.






ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి  తదితర ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు సీఎం కేసీఆర్ గారి వెంట వచ్చి నివాళులర్పించారు.






బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫాం హౌస్ కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ సాయి చంద్ కు గుండెపోటు రాగా... చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు.