తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీదే అధికారం అంటూ వచ్చిన ఆరా మస్తాన్ అనే సర్వే రిపోర్టుపై బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేవి చిల్లర మైండ్ గేమ్స్ అని, వాటిని చూస్తే నవ్వు వస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికి తాను 104 రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నానని, ఏకంగా 15 వేల కిలో మీటర్లు తిరిగానని అన్నారు. తన ప్రయాణంలో 760 గ్రామాలు తిరిగి చెబుతున్నానని, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మైండ్ బ్లాక్ అవడం ఖాయం అని అన్నారు. తమ ఛాలెంజ్‌కి సిద్ధం కావాలని ట్వీట్ చేశారు.


‘‘కేసీఆర్ (KCR) చిల్లర మైండ్ గేమ్స్ చూస్తే నవ్వొస్తుంది. అర్రా మస్తాన్, ఎందరిని ఏం అడిగిండో నాకు తెలవదు కానీ, ఇప్పటికి 104 రోజులు దాదాపుగా 15,000 కిమీ ప్రయాణం,760 పైగా గ్రామాలు తిరిగి చెప్తున్న, ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా మీ #TRS #BJP #INC ల మైండ్ బ్లాక్ అవుడు ఖాయం. Get Ready for Our Challenge’’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 






మరో శ్రీలంక అవుతుందనే సంకేతం - ప్రవీణ్ కుమార్
మరోవైపు, తెలంగాణలో ఉద్యోగులకు వేస్తున్న జీతాల పరిస్థితిపై కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. దానిపై వస్తున్న ట్రోల్స్ ను ట్వీట్ చేస్తూ విమర్శలు చేశారు. తెలంగాణ మరో శ్రీలంక అవుతుందనేందుకు ఇదొక సంకేతం అని చెప్పారు. ఆర్థిక పరిస్థితిపై ప్రెస్ మీట్ లో 3 నిమిషాలు మాట్లాడాలని సవాలు చేశారు.


 ‘‘బంగారు తెలంగాణ లో ఇదీ ఉద్యోగుల పరిస్థితి! రాష్ట్రం మరో  #SriLanka గా మారిందనడానికి ఇదొక సంకేతం. ఫుల్ పేజి Ads ఆశ చూపి (లేదా)జర్నలిస్టులపై కేసులు పెట్టి నిజాన్ని దొర గారు తెలివిగా దాస్తున్నారు. 3 గం.లు ప్రెస్ మీట్ పెట్టేCM గారూ,రాష్ట్ర ఆర్థిక స్థితి పై 3 నిముషాలు మాట్లాడండి ప్లీజ్’’ అని ట్వీట్ చేశారు.






సర్వేలో ఏముందంటే


Aaraa Survey పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ మస్తాన్ ఈ సర్వే చేయించారు. తెలంగాణలో ఈరోజు ఎన్నికలు పెడితే, టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం సాధిస్తుందని ఆ సంస్థ హెచ్ మస్తాన్ తెలిపారు. టీఆర్‌ఎస్‌కు 38.88 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం 8 శాతం తగ్గుతుందని తెలిపారు. కాంగ్రెస్‌కు 23.71 శాతం సీట్లు, అదర్స్‌కు 6.93 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని మస్తాన్ అంచనా వేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఉత్తర భారతీయులు 80 శాతం బీజేపీకి మొగ్గు చూపుతున్నారని అన్నారు.