టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బంగారు కూలీ పేరుతో టీఆర్ఎస్ పార్టీ నిధులు సమీకరిస్తోందని గతంలోనే ఈసీకి రేవంత్ ఫిర్యాదు చేశారు. అయితే, దానిపై విచారణ చేయాలని ఎన్నికల సంఘం ఐటీశాఖను ఆదేశించింది. ఆ విచారణ ఎటూ తేలకుండానే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా ఎలా మార్చుతారని రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.


ఈ రోజు (డిసెంబరు 19) రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ కు సంబంధించి వాదనలు జరిగాయి. రేవంత్ రెడ్డి వేసిన కేసుపైన మీకు ఏ శాఖల పైన అభ్యంతరాలు ఉన్నాయో ఆ శాఖపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని కోర్టు స్వేచ్ఛ ఇచ్చింది.


గతంలో టీఆర్ఎస్ బంగారు కూలి పేరుతో చేసిన నిధుల సమీకరణపై రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసులో ఐటీ శాఖకు సంబంధించిన విచారణ పెండింగ్ లో ఉంది. ఈ పరిశీలన పూర్తి కాకుండా బీఆర్ఎస్ గా పేరు మార్చడంపై రేవంత్ రెడ్డి  అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డిసెంబర్ 6వ తేదీ లోపు బీఆర్ఎస్ విషయంలో అభ్యంతరం ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ఈసీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.


ఎన్నికల సంఘం ప్రకటన మేరకు రేవంత్ రెడ్డి అభ్యంతరాలు నమోదు చేశారు. అయినా కూడా రేవంత్ రెడ్డి అభ్యంతరం పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల సంఘం బీఆర్ఎస్ కు లేఖ ఇచ్చింది. ఈ విషయంపైన ఢిల్లీ హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ కేసు వాదనలు ఈ రోజు జరిగాయి.