తెలంగాణ సమాజం కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తి గద్దర్ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరణ వార్త తెలిసినా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నివాళులు అర్పించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ అసెంబ్లీని చిల్లర మల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ను కేసీఆర్, కేటీఆర్ అభ్యంతరకరంగా దూషించారని అన్నారు. అసెంబ్లీలో తండ్రీ కొడుకులు చర్చ మొత్తాన్ని రేవంత్ రెడ్డి చుట్టూనే తిప్పారని అన్నారు. తనను, కాంగ్రెస్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.


అప్పట్లో చంద్రబాబు అనుచరుడిగా కేసీఆర్


‘‘టీడీపీలో తాను చంద్రబాబు నాయుడుకు శిష్యుడిని కాదు.. సహచరుడిని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచాకే నేను టీడీపీలో చేరాను. కానీ టీడీపీలో కేసీఆర్ ప్రస్థానం చంద్రబాబు అనుచరుడిగా మొదలైంది. నిలువ నీడ లేని కేసీఆర్ కు టీడీపీనే ఆధారం అయింది. తెలంగాణ పట్ల నా నిబద్ధత ఎప్పుడూ మారలేదు. తెలంగాణ సమస్యలపై ప్రశ్నించడంలో నేను ముందున్నా. కానీ, కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీవోపై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. 1996లో 610 జీవోను, జోనల్ విధానం రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్.


1996 లో మంత్రిగా కేసీఆర్ మాట్లాడిన మాటలు వినాలని కేటీఆర్ కు సూచిస్తున్నా. సోనియా వల్లనే తెలంగాణ సాకారమైందని 13 జూన్ 2014లో శాసన సభలో కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ను, రేవంత్ రెడ్డిని దోషిగా ఎలా నిలబెడతారు? తెలంగాణ కోసం 2011లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నది, నిలదీసింది నేనే. చంద్రబాబు సహచరుడిగా ఉన్నా ఆనాడు తెలంగాణపై నా నిబద్ధత మారలేదు. ఆనాడు గవర్నర్ పై దాడి ఘటనలో సభ నుంచి సస్పెండ్ అయ్యాను. 24 జనవరి 2014లో సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 54 నిమిషాలు సభలో వివరించా. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని నొక్కి చెప్పా.


అప్పర్ సీలేరు, లోయర్ సీలేరులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పా. ఎవరికి తలవంచకుండా తెలంగాణ కోసం మాట్లాడిన నిఖార్సైన తెలంగాణ బిడ్డను నేను. కేసీఆర్ నిన్ను నమ్మి వచ్చిన వారిని మోసం చేసిన సంగతి మరిచిపోయావా? కేసీఆర్.. నీ పార్టీ బతికిందే కాంగ్రెస్ తో. కాంగ్రెస్ లేకపోతే నువ్వు, నీ కుటుంబం అడుక్కు తినేవారు. 


24 సంవత్సరాల నా రాజకీయ ప్రస్తానంలో ఏనాడు నేను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలనపై మాత్రమే నేను విమర్శలు చేశా. కేసీఆర్ తన అవసరానికి ఒకసారి టీడీపీతో, మరోసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. సన్నాయి నొక్కులు నొక్కుతున్న కిషన్ రెడ్డి.. 2011లో కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంది నిజం కాదా? శాసన మండలి ఎన్నికల్లో ఓట్లు కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముకున్నది నిజం కాదా? ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకులను ఇవాళ కేసీర్ అక్కున చేర్చుకున్నారు.


నన్ను అలా అంటే సమాజం నమ్మదు


సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇచ్చిన జగన్ కు ప్రగతి భవన్ పిలిచి భోజనం పెట్టింది కేసీఆర్. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన కేసీఆర్ దుర్మార్గుడు. లాలూచీలో కేసీఆర్ ను మించినవారు ఈ దేశంలో ఇక పుట్టరు. మీరా తెలంగాణపై నా నిబద్దత గురించి మాట్లాడేది. 2014 కు పూర్వం మేం ఏం మాట్లాడినా తెలంగాణ కోసమే మాట్లాడాం. నన్ను తెలంగాణ వ్యతిరేకి అంటే తెలంగాణ సమాజం నమ్మదు. ఏ రోకటి కాడ ఆ పాట పాడే వ్యక్తి కేసీఆర్. 


కావాలనే సంయమనం పాటించా


గద్దర్ 2019లో మొదలు పెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాలి. గద్దర్ చివరి కోరిక, ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆయన స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం. నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న నాతో చెప్పారు. యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని నాకు సూచించారు. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని.. జాగ్రత్తగా ఉండాలని ఆయన అప్పుడే చెప్పారు. గద్దర్ మరణించారని ఇప్పటివరకు నేను సంయమనం పాటించా. ప్రజా కోర్టులో కేసీఆర్ దోషిగా నిలబడ్డారు.. ప్రజల గుండెల్లో గద్దర్  వీరుడిగా నిలబడ్డారు. 


గద్దర్ మరణాన్ని రాజకీయం చేయొద్దనే నేను విజ్ఞత ప్రదర్శించా.. లక్ష్యాన్ని చేరేవరకు కార్యదీక్షతో పనిచేస్తామని కేసీఆర్ ను హెచ్చరిస్తున్నా. నేను లేవనెత్తిన అంశాలపై, తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధం. నువ్వు వస్తావో, కేటీఆర్ ను పంపుతావో.. హరీష్ ను పంపుతావో తేల్చుకో. ఈసారి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 25కు మించి సీట్లు రావు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ పై దాడి చేస్తున్నారు’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.