Revanth Reddy Open Letter: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల, జూనియర్ లెక్చరర్ల జీతాల చెల్లింపు గురించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఉండవని, అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. అవిభక్త రాష్ట్రంలో పాలకులు కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎంతో బాధ కలిగించారని అన్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఒక్క సంతకంతో ఈ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సార్లు హామీ ఇచ్చారని వివరించారు. అంతేకాకుండా 2014లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనుకున్నట్లుగానే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని.. అయినా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల కష్టాలు తీరలేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 






బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీతాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. మే నెలలో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు కూడా ఏప్రిల్ నెల జీతాలు అందలేదన్నారు. కొన్ని జిల్లాల్లో డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వందలాది మంది ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా.. నెలల తరబడి సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారి ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు అప్పులకే మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభకు గురవుతున్నారని స్పష్టం చేశారు.


ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేవారని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని దుస్థితి నెలకొందని అన్నారు. ఇప్పుడు కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు ఐదారు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రమని చెప్పుకోవడం తప్ప కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని విద్యావేత్త కొఠారీ అన్నారని గుర్తు చేశారు. అందుకే దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదుల్లో బోధించే లెక్చరర్లకు జీతాలు చెల్లించకుండా వేధించడం సహించరానిదంటూ మండి పడ్డారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు సకాలంలో వేతనాలు అందేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ సర్కారుపైనే ఉందని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పక్షాన నిలబడి వారితో పోరాటం చేయిస్తుందని చెప్పుకొచ్చారు. 


మా డిమాండ్లు ఇవే: రేవంత్ రెడ్డి


కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ఐదు నుంచి ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందేలా చూడాలన్నారు. ఇవే కాకుండా వివిధ కారణాల వల్ల క్రమబద్ధీకరించబడని వారిని వెంటనే క్రమబద్ధీకరించాలని లేఖలో తెలిపారు. .