Telangana News: తెలంగాణలో ఇన్నాళ్లు రుణమాఫీపై పెద్ద చర్చ సాగింది. ఎప్పుడు ఇస్తారు. ఎవరికి ఇస్తారు. విధివిధానాలు ఏంటనే అనుమానాలు ప్రజల్లో ఉండేవి. అయితే మూడు రోజుల క్రితం విధివిధనాలు ఖారారు కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ మరో ప్రభుత్వం పథకంపై పడ్డాయి. అదే ఇందిరమ్మ ఇళ్ల పథకం. 


లబ్ధిదారుల ఎంపిక ఎలా?


ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హతలు ఏంటీ ప్రభుత్వం తీసుకొచ్చే విధివిధానాలు ఏంటనే అంశంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంలో లబ్ధిదారుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని మాట గట్టిగా వినిపిస్తోంది. ఇంటి విస్తీర్ణం 400 ఎస్‌ఫ్‌టీకి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా రూల్స్ ఫ్రేమ్ చేయాలని భావిస్తోంది. 


ప్రస్తుతానికి కనీసం 60 చదరపు గజాలు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు వెంటనే మంజూరు చేయనుంది. ఇందులో హాల్, కిచన్‌, మరుగుదొడ్డి, ఒక బెడ్‌రూం ఉండేలా ప్లాన్ చేయనున్నారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇళ్ల నిర్మాణాలపై విధివిధానాలు ఖరారు చేయనున్నారు. 


ఇతర్రాష్ట్రాల్లో అధ్యయనం


ఇప్పటికే దీనిపై ప్రభుత్వం ఇతర్రాష్ట్రాల్లో ఉన్న ఇళ్ల నిర్మాణల పాలసీలను పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలను తెలుసుకుంది. ప్రత్యేక అధికారుల బృందం అక్కడ అధ్యయనం చేసి వచ్చారు. అయితే ఏ రాష్ట్రంలో కూడా ఇళ్ల నిర్మాణం ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించడం లేదని... కొంతమాత్రమే ఇస్తున్నాయని నివేదికలో అధికారులు వెల్లడించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు కట్టించబోయే ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. 


ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులు వచ్చేలా


ఇప్పటికే అమలు అవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 300 ఎస్‌ఎఫ్‌టీ కంటే తక్కువ ఉన్న ఇళ్లకు నిధులు మంజూరు చేయడం లేదు. దాన్ని కంటే ఎక్కువ ఉంటేనే నిధులు ఇస్తున్నారు. అందుకే రేవంత్ సర్కారు 400 చదరపు అడుగులను బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరుతో 560 ఎస్‌ఎఫ్‌టీ స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చింది. అలాంటివి లబ్ధిదారులకు నిర్మించి ఇవ్వాలంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పడనుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ విధివిధానాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రజల అభిప్రాయం ప్రకారం మధ్యస్తంగా విధివిధానాలు ఖరారు చేయనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒకే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యమవుతుందని భావించే వాళ్లు సొంతగా నిర్మించుకోవచ్చని కూడా చెప్పనుంది. 


అయితే గతంలో ఒకసారి ప్రభుత్వ ఇళ్ల పథకంలో లబ్ధి పొందిన వాళ్లు కూడా మరోసారి దరఖాస్తులు చేసుకున్నారు. అలాంటి వారు మొన్నటి ప్రజాపాలన కార్యక్రమంలో 80 లక్షలపైగా దరఖాస్తులు సమర్పించారు. అలాంటి వారిని ఈస్రి తప్పించాలని భావిస్తున్నారు. ఒకే గదిలో ఉంటున్న వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. విశాలంగా ఉండి పైకప్పు పక్కా నిర్మాణం కాకపోతే మాత్రం వారు అర్హులు అవుతారు. అయితే ఇంకా ఇది ఫైనల్ కాదని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.