Harish Rao Comments: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చేసిందంతా చేసి ఇపుడు హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. ఎమ్మెల్యే గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు? రేవంత్ రెడ్డి, డీజీపీ కాదా? అని ప్రశ్నించారు. కోకాపేటలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.


‘‘పోలీసులను అడ్డంపెట్టుకొని మా ఎమ్మెల్యే పై దాడి చేసినపుడు రేవంత్ కు, డీజీపీకి లా అండ్ ఆర్డర్ గుర్తు రాలేదా? మీరు ఎందుకు నిన్న చర్యలు తీసుకోలేదు డీజీపీ గారు. గాంధీ చేసిన దాడి కాదు, రేవంత్ రెడ్డి చేసిన దాడి. మమ్మల్ని ఈరోజు హౌజ్ అరెస్ట్ చేశారు, నిన్న గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదు. నిన్నటి దాడికి కారణం సీఎం, డీపీజీ దే. చెయ్యాల్సింది చేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మంలో మా మీద దాడి చేస్తే పది రోజులైనా గుండాల మీద కేసులు పెట్టలేదు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్టులు చేస్తరా? గంటల పాటు తప్పి మహబూబ్ నగర్ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. మమ్మల్ని అరెస్టులు చేస్తారు, హత్యాయత్నం చేసిన అరికపూడి గాంధీని, అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపుతారా?


మాకు నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల పాటు తిప్పి, దాడులు చేసిన వాళ్లను పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపించారు. రాచ మర్యాదలు చేశారు. నిన్న జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ అంతా రేవంత్ రెడ్డి. రేవంత్ డైరెక్షన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పాడుచేయొద్దని, పోలీసుల గౌరవాన్ని తగ్గించవద్దని మేము సంయమనం పాటించాం. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలను నిన్న సాయంత్రం నుంచి ఎక్కడిక్కడ హౌజ్ అరెస్టులు చేస్తున్నారు. ఫోన్లు చేసి పోలీసు స్టేషన్లకు రావాలని భయబ్రాంతులకు గురి చేస్తున్నరు. ఇంత దుర్మార్గమా..? నీ హౌజ్ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుందే తప్ప తరగదు.


ఎమర్జెన్సీ కన్నా దారుణంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయి. విత్తొకటి నాటితే మొక్కొక్కటి మొలుస్తుందా. పైన సక్కగ వుండాల్సిన నీకే వక్ర బుద్ది ఉంటే కింది స్థాయిలో సక్కగా ఉంటారా ? తన అసభ్య, సంస్కార హీనమైన భాషను మార్చుకోకుండా యూ ట్యూబ్ చానళ్లకు నీతులు చెబుతున్నాడు. ముందు నువ్వు సక్కగా మాట్లాడితే అందరూ సక్కగా అవుతారు, యదా రాజ తథా ప్రజ అన్నట్లు ఉంది. కోమటి రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాలని చెప్పడం దారుణం. తొమ్మిది నెలల్లో పాలన పై కాకుండా పైసల పై దృష్టి పెట్టడం వల్లే శాంతి భద్రతలు పాతాళానికి పోయాయి.


‘‘హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారు, వరద బాధితులకు సాయం చేయకుండా మీ మీద దాడి చేయించాడు. రైతు బంధు గురించి అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టు అంటడు. డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఖమ్మం, హైదరాబాద్ లో మిమ్మల్ని మీరు రాళ్లతో కొట్టవచ్చు. మీరు విసిరే రాళ్లే అధికారంలోకి బిఆర్ఎస్ రావడానికి పునాది రాళ్లు అవుతాయి జాగ్రత్త. 16వ ఆర్థిక సంఘం గురించి మీరు తప్పుడు లెక్కలు చెబితే, మేము బాధ్యతాయుతంగా బలమైన వాదనను వినిపించాం. నీటి ప్రాజెక్టులకు, మిషన్ భగీరథకు, రాష్ట్ర అభివృద్దికి నిధులు కావాలని కోరాం. రాజకీయం కాదు, రాష్ట్రం ముఖ్యమని భావించి వాస్తవాలు లెక్కల రూపంలో చెప్పాం. 16వ ఆర్థిక సంఘాన్ని సాయం కోరాం. ఆంధ్రా నాయకుల మీద రేవంత్ రెడ్డి కపట ప్రేమ వలకబోస్తున్నారు. చిన్న జీయర్ గారిని, యాదాద్రిని నిర్మాణానికి ప్లాన్ ఇచ్చిన ఆనంద సాయిని ఆంధ్రోడు అన్నడు రేవంత్ రెడ్డి. డిఫెన్స్ లో ఉన్న ప్రతిసారి కొత్త డ్రామా చేస్తున్నడు. కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకున్నడు. 
• పీఏసీకి ఎన్నిక జరిగిందని నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది’’ అని హరీశ్ రావు మాట్లాడారు.