Rains in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్,  పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు.


జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే  రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు.


అత్యవసర పని అనుకుంటే తప్ప ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని సీఎం కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.