Revanth Reddy Cabinet :  తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణం చేయబోతున్నారు. పూర్తి స్థాయి కేబినెట్ ప్రమాణం జరుగుతుందని నిన్నటి  వరకూ అనుకున్నారు కానీ.. ఇప్పుడు సీనియర్ నేతలు ఆరుగురితో మత్రమే ప్రమాణం చేయించబోతున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి కాకుండా మరో ఐదారుగురు మాత్రమే ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇందులో ఒక డిప్యూటీ  సీఎం ఉండే అవకాశం ఉంది. స్పీకర్ గా సీనియర్ నేతను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే అ పదవిని తీసుకునేందుకు సీనియర్ నేతలు ఆసక్తి చూపించడం లేదు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి పేర్లు స్పీకర్ పదవికి పరిశీలనలో ఉన్నాయి. అయితే వారు మాత్రం తమకు వద్దే వద్దంటున్నారు. అందుకే స్పీకర్ పదవి గురించి తేలిన తర్వాత మిగతా కెబినెట్ గురించి ఆలోచన చేసే ఉందని చెబుతున్నారు.                          
 
రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణం చేసే వారిలో సతక్క, భట్టి విక్రమార్క, ఉత్తమ్ లేదా కోమటిరెడ్డి  ఉంటారని అంటున్నారు. మంత్రి పదవుల కోసం చాలా మంది ఢిల్లీలో విస్తృతమైన లాబీయింగ్ చేసుకుంటున్నారు. భట్టి విక్రమార్క తిరిగి ఇంకా హైదరాబాద్ కు రాలేదు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి అందర్నీ ఆహ్వానించి హైదరాబాద్ కు వచ్చేశారు కానీ ఆయన మాత్రం హైకమాండ్ పెద్దలతో మాట్లాడుతున్నారు. తాము అసంతృప్తికి గురయ్యామన్న సమాచారన్ని మీడియాకు లీక్ చేశారు కానీ హైకమాండ్ పట్టించుకోలేదు . దీంతో వారు కనీసం తమకు కీలక మంత్రిత్వ శాఖలు అియనా ఇప్పించాలని హైకమాండ్ వద్ద పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.                 


పార్టీకి విధేయంగా  పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఓడిపోయిన కొంత మందికి ఎమ్మెల్సీ ఇచ్చి అయినా పదవులు కల్పించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ పరాజయం పాలయ్యారు. వీరిలో ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి మొదటి నుంచి సపోర్ట్ గా ఉంటున్న షబ్బీర్ అలీకి చాన్స్ ఉందని భావిస్తున్నారు. ఈ సారి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గారన్న అభిప్రాయం ఉండటంతో..  మొదటి విడతలోనే ప్రమాణం చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు.                     


ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ.వేణుగోపాల్, తదితర నేతలను రావాల్సిందిగా నేతలను రేవంత్ ఆహ్వానించారు. ఈ ప్రమాణస్వీకారానికి విపక్ష పార్టీ నేతలను, ప్రాముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.  ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీఎంలను కూడా రేవంత్ ఆహ్వానించారు.  అలాగే సినీ ప్రముఖులతో పాటు మేధావులను కూడా పిలుస్తున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత ఆరు గ్యారంటీల అమలుపై మొదటి సంతకం చేసే అవకాశం ఉంది.