Revanth Reddy :   తెలంగాణలో ఏడుగురు ఐఏఎస్‌లు, కేసీఆర్, కేటీఆర్ డీ-9 గ్యాంగ్‌గా ఏర్పడి భూదందాలకు పాల్పడుతున్నారని  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కేబిఆర్ పక్కన నిర్మిస్తున్న ఓ భారీ భవన నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించారు. అక్కడ మూడు వేల గజాల్లో 21 అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని..  అక్కడ  ఐదు అంతస్తుల కన్నా ఎక్కువ ఏ ఒక్క భవనానికీ పర్మిషన్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.               


బంజారాహీల్స్, జూబ్లీహీల్స్ ప్రాంతాల్లో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  కేబీఆర్ పార్క్ దగ్గర నిర్మాణాలకు కూడా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని చెప్పారు. అందుకే పార్క్ చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కేసీఆర్ వచ్చాకే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలు పెరిగాయన్నారు.   బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ దగ్గర  నిజాం హెరిటేజ్ బిల్డింగ్ ఉండేదని.. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టారని ఆరోపించారు.   హెరిటేజ్ బిల్డింగ్ ను కుర్రా శ్రీనివాస రావు  అనే వ్యక్తి కొన్నారని వెల్లడించారు.   


అయితే శ్రీనివాస రావుకు అనుమతుల కోసం  కొంత భూమిని లంచంగా అడిగారని ఆరోపించారు.  ఇరవై శాతం భూమిని తీసుకుని  గ్రీన్ జోన్ లో ఉన్న వారసత్వ బిల్డింగ్ ను కూలగొట్టి కొత్త నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు.   గ్రీన్ జోన్ లో  కొత్త నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  రూల్స్ విరుద్ధంగా కొత్త భవనానికి అనుమతిచ్చారని ఆరోపించారు. 5 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇవ్వని చోట.. 21 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు.  3 వేల గజాల స్థలంలో 21 అంతస్థులకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. పక్కనే ఉన్న బసవతారకం ఆస్పత్రికి 3 అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదన్నారు.                                             


ఏడుగురు ఐఏఎస్ లు, ఇద్దరు తండ్రీ కొడుకులు కలిసి డీ 9 గ్యాంగ్ గా మారారని విమర్శించారు.  20 శాతం భూములు రాసిచ్చిన వారికే నిర్మాణాలకు అనుమతిచ్చారని ఆరోపించారు రేవంత్. 21 అంతస్థుల అపార్ట్ మెంట్ వల్ల  కేబీఆర్ పార్క్ దగ్గర  భారీగా ట్రాఫిక్ సమస్యలు వస్తాయన్నారు రేవంత్. కేసీఆర్ దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్ట అని ..మీ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఇంత విధ్వంసం సృష్టిస్తారా? అని మండిపడ్డారు రేవంత్. తెలంగాణ సీఎం కేసీఆర్ భూదందాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే కొద్ది రోజుల పాటు ఇలా అనేక అక్రమాలను బయట పెడతానని అంటున్నారు.