Revanth Reddy Chit Chat In Delhi :  తెలంగాణ ఫోన్ ట్యాపింక్ కేసులో సీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని.. ప్రతీ దానికి సీబీఐ విచారణ కావాలనే వారు ఇప్పుడు ఎందుకు కోరడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన  రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. పోన్ ట్యాపింగ్ కేసు   వ్యవహారంలో పోలీసులకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చామన్నారు. అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయమయ్యాయని.. బాధ్యులు ఎవరో తేల్చే క్రమంలో ట్యాపింగ్‌ అంశం బయటకు వచ్చిందన్నారు. మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, ఆ అవసరంలేదని మాకు లేదన్నారు. ట్యాపింగ్ లాంటి వెదవ పనులు తాము చేయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్‌లో ఉన్నాయో.. ఇంకా ఎక్కడ ఉన్నాయో విచారణ అధికారులు తేల్చాలని ముఖ్యమంత్రి అన్నారు.


కీరవాణి సంగీతాన్ని సెలక్ట్ చేసుకుంది అందెశ్రీనే !                                
 
తెలంగాణ గేయానికి సంబంధించి సంగీతాన్ని కీరవాణికి అప్పగించడంపై  వస్తున్న విమర్శలపైనా మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ గేయానికి సంబంధించిన  బాధ్యతను  అందెశ్రీ అప్పగించామన్నా రు. ఎవర్ని తీసుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. అందెశ్రీనే కీరవాణి సంగీతాన్ని కోరుకున్నారన్నారు.  తెలంగాణ అధికారిక చిహ్నం రూపకల్పన రుద్ర రాజేశంకి ఇచ్చామన్నారు. తెలంగాణ అంటే రాచరికానికి వ్యతిరేకమని, త్యాగాలు పోరాటాలు గుర్తుకు వస్తాయన్నారు. అవి గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని తెలియజేశారు.  


నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై చర్యలు                                          


తెలంగాణలో విద్యుత్ సమస్య లేదని ..వినియోగం పెరగడంతో సరఫరాలో కొన్నిచోట్ల అవాంతరాలు ఏర్పడుతోందన్నారు.  అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అవన్నీ చర్చిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.   కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిఫుణులు చెప్పింది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. దాని ఆధారంగానే ముందుకు వెళ్తామన్నారు. 


అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలే రాలేదన్న రేవంత్                              
  
పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్సఫర్ చేశారని, తెలంగాణలో ఎలాంటి ట్రాన్సఫర్‌లు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఎన్నికలు జరిగాయని, స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించామన్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేయలేదని గుర్తు చేసారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసం సోనియాను ఆహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీ వచ్చారు.