Revanth counters BRS on Phone Tapping Case: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను తెలంగాణ జాతిపిత గా అభివర్ణిస్తూ, ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని ప్రశ్నించడంపై  సీఎం రేవంత్ రెడ్డి  సెటైర్లు వేశారు.  నిజమైన జాతిపిత మహాత్మా గాంధీ.. పదవులను త్యాగం చేసి, తూటాలకు ప్రాణాలర్పించారు. కానీ, ఇక్కడ జాతిపిత అని చెప్పుకుంటున్న వారు పదవులు, వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు  అని మండిపడ్డారు. ప్రజలు తమను తిరస్కరించినప్పుడు హుందాగా తప్పులు ఒప్పుకుంటే గౌరవం ఉండేదని, కానీ ప్రజలే తప్పు చేశారనే ధోరణిలో మాట్లాడటం ఏ రకమైన ఉద్యమకారుడి లక్షణమని ఆయన ప్రశ్నించారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారణ చేయడంతో  బీఆర్ఎస్ శ్రేణుల విమర్శలకు ముఖ్యమంత్రి అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు.  రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన  ప్రసంగించారు. 

Continues below advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణను బీఆర్ఎస్ నేతలు 'రాజకీయ కక్ష సాధింపు'గా అభివర్ణించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారని, అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.  మనం దైవాంశ సంభూతులం కాదు.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అంబేద్కర్ చెప్పారు  అని గుర్తు చేశారు.  శిబు సోరెన్ వంటి పెద్ద నాయకులే విచారణ ఎదుర్కొన్నప్పుడు, ఇక్కడ ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవని తేల్చి చెప్పారు.  గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారుల పట్ల వ్యవహరించిన తీరును రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి, బెడ్ రూమ్ నుంచి ఈడ్చుకెళ్లి అరెస్టు చేసినప్పుడు ఈ  ఉద్యమ స్ఫూర్తి' ఏమైంది? అని నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం నోటీసులు ఇచ్చి, గౌరవప్రదంగా విచారణకు పిలిచిందని.. బీఆర్ఎస్ హయాంలా అరాచకంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. రావి నారాయణ రెడ్డి వంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారని, అలాంటి మహనీయుల వారసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు.        

 మధ్యయుగాల చక్రవర్తులు తమ వ్యక్తిగత బాధను  రాజ్యం బాధగా ప్రచారం చేసుకునేవారని, ఇప్పుడు కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు కూడా తమపై జరుగుతున్న విచారణలను తెలంగాణకు జరిగిన అవమానంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  చక్రవర్తుల కాలం చెల్లిపోయింది, ఇది ప్రజాస్వామ్యం అని గుర్తు చేస్తూ, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూనే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు.