Rajagopal Reddy : తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తే నా ఆలోచనలు మారాయి. కేసీఆర్ ని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలో ఒక్క కుటుంబం తప్పా అందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. అందుకే పార్టీ మారుతున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియతో మాట్లాడారు.  తెలంగాణ సమాజానికి మేలు చేసెందుకే తన నిర్ణయమన్నారు.  కాంగ్రెస్ పార్టీ ద్వారానే నీతివంతమైన పాలన అందుతుందని..  సామాజిక తెలంగాణ సాకారం కావాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన చెప్పారు. 


 కేసీఆర్ దుర్మార్గ పాలన పోవాలని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పార్టీ మారొద్దని అనుకున్నాను. మోదీ, అమిత్ షా నాకు సహకరించారు. తుదిశ్వాస వరకు బీజేపీలో ఉండాలని నిర్ణయించుకున్నా. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోవడం బాధగా అనిపించింది. కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుందని మునుగోడు కార్యకర్తలు కోరుతున్నారని అందుకే తాను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారని.. అహంకారంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని అప్పటి నుంచే కేసీఆర్‌పై తన పోరాటం ప్రారంభమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా తన పాత్ర పోషించానన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే పార్టీ బీజేపీ మాత్రమే అని ఆనాడు భావించానన్నారు.


దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలు చూసి బీజేపీపై అప్పుడు నమ్మకం కలిగిందన్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత బీజేపీ నిర్ణయాలతో పార్టీ బలహీనమైందన్నారు. కర్నాటక ఫలితాల తర్వత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. తెలంగాణ సమాజం కోసమే తన నిర్ణయం ఉంటుందన్నారు. తాను బీజేపీలోకి వెళితే కాంట్రాక్టు కోసమే వెళ్లానని ప్రచారం చేశానన్నారు. కాంట్రాక్ట్ కోసమే బీజేపీలోకి వెళితే మళ్లీ ఎందుకు పార్టీ మారతానన్నారు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారన్నారు.  కానీ కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే భావన ప్రజల్లో వచ్చిందన్నారు. 100 మంది బీఆర్ఎస్ నేతలు ఎంతో కష్టపడితే మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. తెలంగాణ సమాజం ఇప్పుడు కాంగ్రెస్‌తోనే ఉందన్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందన్నారు.   కాంగ్రెస్ ఆదేశిస్తే గజ్వేల్ నుంచి పోటీలో ఉంటానన్నారు. డబ్బు, అధికారంతో మునుగోడులో గెలిచారన్నారు. గజ్వేల్‌లో అవకాశం ఇస్తే కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు.
  
తన భార్య రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.  ఆమెకి రాజకీయాల్లోకి రావాలని లేదు. ఆమె ఎప్పటికీ పోటీ చేయదు. మునుగోడు నుంచి  తానే పోటీ చేస్తానన్నారు.  ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తా అని చెప్పలేదు. ప్రాణం ఉన్నంత వరకు మునుగోడు ప్రజలతోనే ఉంటా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.  పార్టీ మారినప్పుడు కొందరు నాపై దుష్ప్రచారం చేశారు. నేను కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయా అని అన్నారు. కేసీఆర్ కాంట్రాక్టు ఇస్తా అంటేనే తాను తీసుకోలేదన్నారు.