తెలంగాణ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరు జరగబోతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం (అక్టోబరు 31) ఉమ్మడి మహబూబ్‌ నగర్ (నాగర్ కర్నూల్) జిల్లాలోని కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రజాభేరి సభ నిర్వహించింది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. తన సోదరి ప్రియాంక గాంధీ రావాల్సి ఉందని.. కానీ చెల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో తాను ఈ సభకు వచ్చానని చెప్పారు. చెల్లి ప్రియాంక రాలేనందున తాను తన కుటుంబ సభ్యుల కోసం వచ్చానని రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


ధరణి పేరుతో కుట్ర


‘‘ధరణి పేరుతో భూముల్ని లాగేసుకునే కుట్ర జరుగుతోంది. ధరణితో లాభం జరిగింది కేవలం కల్వకుంట్ల కుటుంబానికే. ప్రభుత్వ సంస్థలు అన్ని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర ప్రజల ధనం పూర్తిగా కల్వకుంట్ల కుటుంబానికే వెళ్తోంది. వారి చేతుల్లోనే రెవెన్యూ, ఎక్సైజ్ లాంటి శాఖలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు కలలు కన్నది దొరల తెలంగాణ కోసం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో నీటి ప్రాజెక్టులను నిర్మించింది. నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, సింగూర్ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే. 


కౌలు రైతులకూ రైతు భరోసా


ఈ రాష్ట్రానికి వెన్నెముకగా మహిళలు ఉన్నారు. రైతు భరోసా అనే కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తోంది. రూ.15 వేలు ప్రతి ఏడాదికి, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల రూపాయలు ఇస్తాం. గ్రుహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు కాల్చే కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం కింద పింఛన్లు రూ.4 వేలు చేయబోతున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం. 


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్‌కు యుద్ధం జరుగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ - బీజేపీ - ఎంఐఎం ఒకే తానుముక్కలుగా పని చేస్తున్నాయి. లోక్ సభలో ఏ బిల్లు వచ్చినా బీజేపీకి కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. దేశంలో విపక్ష ముఖ్యమంత్రుల మీద ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయి. అదే తెలంగాణలో మాత్రం ఏ ఈడీ, విజిలెన్స్, సీబీఐ దాడులు ఏమీ ఉండవు. బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండూ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నాయి. 


మీరు ఎంఐఎంకి ఓటేసినా, బీఆర్ఎస్‌ ఓటేసినా వేస్ట్. బీజేపీకి ఓటేసినా పరోక్షంగా బీఆర్ఎస్‌కి ఓటేసినట్లే. ఇక్కడ బీఆర్ఎస్ ను పడగొట్టడమే కాకుండా, 2024లో బీజేపీని రానివ్వకుండా అడ్డుకుంటాం. తెలంగాణ ప్రజలు స్పష్టతతోనే ఉన్నారు. ఈ రోజు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి. మన బంధం రాజకీయ బంధం మాత్రమే కాదు. కుటుంబ బంధం. చరిత్రలో ఇందిరా గాంధీకి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. మీరందరూ తెలంగాణ కోసం పోరాడితే, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని మంజూరు చేశారు’’ అని రాహుల్ గాంధీ మాట్లాడారు.