ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం తారాస్థాయికి చేరింది. జనసేన అంతర్గత సమావేశంలో పవన్, అమిత్ షా మధ్య జరిగిన సంభాషణలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో జనసేనను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నాగేశ్వర్ ను జనసేన, పవన్ అభిమానులు టార్గెట్ చేయడం, తిరిగి నాగేశ్వర్ వాటికి కౌంటర్ ఇవ్వడంతో మొదలైన వివాదం కాస్తా పవన్ కళ్యాణ్ స్పందించే వరకూ వెళ్లింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. క్రెడిబిలిటీ ఉన్న ప్రొఫెసర్ వంటి వ్యక్తులు ఇలా మాట్లాడం సరికాదంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇక చూస్తూ ఊరుకోమంటూ పవన్ ఘాటుగా స్పందించారు.

Continues below advertisement

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అని ప్రచారం..

సీన్ కట్ చేస్తే మంగళవారం ఉదయం నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు కొట్టాయి. తెలంగాణకు ఏపి పోలీసులు చేరుకున్నారని, హైదరాబాద్ లోని నాగేశ్వర్ ఇంటి వద్దకు ఏపి పోలీసులు వచ్చారంటూ వాట్సప్ గ్రూపుల్లో వార్తలు దుమారం రేపాయి. ఇంకేముంది మరికాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అని అంతా అనుకుంటున్న సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ABP Desam సంప్రదించింది.

Continues below advertisement

అరెస్ట్ వార్తల పై ఏబీపీ దేశం ప్రతినిధితో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫోన్లో మాట్లాడారు. అవన్నీ బోగస్ వార్తలేనని, నమ్మాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. నా ఇంటి వద్ద ఉన్నది పోలీసులే కానీ వాళ్లు ఏపీ పోలీసులు కాదు, తెలంగాణ పోలీసులు అని క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తనపై వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా బెదిరింపు మేసేజ్ లు, కాల్స్ రావడంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఆయన ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు ‘ఏబీపీ దేశం’కు తెలిపారు ఫ్రొఫెసర్ నాగేశ్వర్.

Also Read: AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం

పవన్ కళ్యాణ్ తో వివాదంపై ఏమన్నారంటే..

పవన్ కళ్యాణ్ , అమిత్ షాకు సంబంధించిన వ్యవహారంలో నేను చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకున్నాను. ఇప్పటికే జనసేన క్యాడర్ కు కూడా ఈ విషయంపై ఎటువంటి కామెంట్స్ చేయొద్దంటూ పార్టీ నుండి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇది ఇప్పటికే ముగిసిన వివాదం. దీనిపై మాట్లాడటం సరికాదు. ముగిసిన అధ్యాయం తెరవమంటే కుదరదు. నేను ఉపసంహరించుకున్న మాటలపై నేను మళ్లీ మాట్లాడను. ఇప్పటి వరకూ ఏపీ పోలీసుశాఖ నుండి నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. నాపై కేసు నమోదైనట్లు ఏపి పోలీసులెవ్వరూ చెప్పలేదు. ఫోన్ లేదా వాట్సప్ ద్వారా ఏపి పోలీసుల నుండి నాకు ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం అందలేదు.

Also Read: TDP Mahanadu 2026: నేటి నుంచి 2 రోజులపాటు టీడీపీ మహానాడు.. ఈసారి అజెండా, తీర్మానాలు, ప్రత్యేకతలు ఇవే

అరెస్ట్ వార్తలపై స్పందించిన ఏపీ హోం మంత్రి

ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపి పోలీసులు తెలంగాణ చేరుకున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఏపీ హోం మంత్రి అనిత తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ నుండి పోలీసులు ఎవరూ హైదరాబాద్ వెళ్లలేదు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దురుద్దేశ్యంతోనే ఇలాంటి అసత్య ప్రచారం చేసి, కావాలనే ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి వారిపై చట్టపరంగా పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకుంటుందంటూ ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.