తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని అక్రమ నగదు, బంగారాన్ని భారీగా సీజ్ చేస్తున్నారు. ఎవరి వద్దనైనా రూ.50 వేలకు పైగా నగదు, 10 గ్రాములకు పైగా బంగారం కనిపిస్తే స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, ఈ తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసీ స్పందించింది. బాధితులు సదరు సొమ్మును తిరిగి పొందేందుకు ప్రతి జిల్లాలోనూ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది. పోలీసుల తనిఖీల్లో చిక్కిన నగదు, బంగారు ఆభరణాల యజమానులు ఈ సెల్ ఛైర్మన్ ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లోనే మీ నగదును తిరిగి ఇచ్చేస్తారు. అయితే, వీటి విలువ రూ.10 లక్షల్లోపు మాత్రమే ఉండాలి. అంతకు మించితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు వివరాలు వెల్లడించాలి. వారు చట్టపరమైన అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ లో రోజుకు పదికి పైగా సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారు.


డబ్బులు ఇలా తిరిగి పొందండి



  •  తనిఖీల్లో మీ బంగారం, నగదును పోలీసులు పట్టుకుంటే సంబంధిత ఠాణాలో భద్రపరిచి కేసు నమోదు చేస్తారు. ఆ సమాచారాన్ని సంబంధిత యజమానులకు తెలియజేస్తారు. 

  • ఈ వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్, ఆదాయపు పన్ను అధికారులకు పంపిస్తారు.

  • వీటిని తిరిగి పొందాలనుకునేవారు పోలీస్ కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చూపించాలి. అక్కడి అధికారులు గ్రీవెన్స్ సెల్ కు బదిలీ చేస్తారు. 

  • అనంతరం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన ఓ రశీదు ఇస్తారు. అనంతరం తమ సెల్ అధికారులు ఫోన్ చేసినప్పుడు రావాలని సూచిస్తారు.

  • 48 గంటల్లోపు సదరు బాధితులను పిలిచి వారు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే రిటర్నింగ్ అధికారికి వివరాలు తెలియజేస్తారు.

  • ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సీజ్ చేసిన సొమ్మును తిరిగిచ్చేయాలని సంబంధిత ఠాణాకు ఆదేశాలిస్తారు. బాధితులు అక్కడికి వెళ్లి మీ నగదు తీసుకోవాల్సి ఉంటుంది.

  • అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.50 వేల కన్నా ఎక్కువ నగదును ప్రజలు తమ వెంట తీసుకెళ్లొద్దని, అత్యవసరమై తీసుకెళ్లాల్సి వస్తే తగిన ఆధారాలు, సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


రూ.243 కోట్లకు పైగా సొత్తు స్వాధీనం


మరోవైపు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.243 కోట్లకు పైగా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో మొత్తంగా రూ.103 కోట్ల విలువైన నగదు సీజ్ చేయగా, ఈసారి కేవలం 10 రోజుల్లోనే అంతకు రెట్టింపు సొమ్ము పట్టుకోవడం గమనార్హం. గురువారం ఒక్క రోజే తనిఖీల్లో రూ.78.03 కోట్ల సొత్తు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో రూ.120.40 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు పట్టుబడ్డాయి. గత 24 గంటల్లో 83 కిలోల బంగారం, 213 కిలోల వెండి, 113 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.