ED Questions Prakash Raj : నటుడు ప్రకాష్ రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జూలై 30 న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న తమ జోనల్ కార్యాలయంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ,  గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించింది.   జంగిల్ రమ్మీ వంటి అనధికార బెట్టింగ్ యాప్‌లకు ప్రకాష్ రాజ్ ప్రమోషన్‌ చేచశారు.  ఇందులో ప్రకాష్ రాజ్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. విచారణ తర్వాత ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు.  ఇది బెట్టింగ్ యాప్‌ల మనీలాండరింగ్ కేసని.. తాను  2016 లో  ప్రమోట్ చేశానన్నారు. నైతిక ప్రాతిపదికన, నేను దానిని కొనసాగించలేదన్నారు.  దాని నుండి డబ్బు సంపాదించాలని అనుకోనందున...  ఎటువంటి డబ్బు  అందుకోలేదని  వారికి సమాచారం ఇచ్చానన్నారు.                                  

తన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను (ప్రమోషన్‌కు మూడు నెలల ముందు ,  ఆరు నెలల తర్వాత వరకు ED అధికారులకు సమర్పించారు. ఈ విచారణలో ఎటువంటి రాజకీయ కారణాలు లేవని, అధికారులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని, ఒక పౌరుడిగా తాను సహకరించడం తన బాధ్యత అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.  

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లైన జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్365, A23, యోలో247, ఫెయిర్‌ప్లే వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగిన అక్రమ బెట్టింగ్ , గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన కేసు.  ఈ యాప్‌లు కోట్ల రూపాయల విలువైన "అక్రమ" నిధులను సమీకరించినట్లు ED అనుమానిస్తోంది.  సైబరాబాద్ పోలీసులు మార్చి 2025లో వ్యాపారవేత్త PM ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు 25 మంది సెలబ్రిటీలు , ఇన్‌ఫ్లూయెన్సర్‌లపై బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి FIR దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్‌తో సహా 29 మంది సెలబ్రిటీలు , ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఈ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రమోషన్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ లేదా ఛారిటబుల్ కంటెంట్‌గా  ఉండి, అనధికార గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రోత్సహించినట్లు ED సందేహిస్తోంది.   ఈ యాప్‌ల ప్రమోషన్ కారణంగా చాలా మంది ఆర్థిక నష్టాలను చవిచూశారని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.