Ponguleti Srinivas Reddy: తాను జాతీయ పార్టీలోనే చేరబోతున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే ఏ పార్టీలో అనేది ఈ నెలాఖరులోగనే వెల్లడిస్తానన్నారు. శనివారం రోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో పొంగులేటి క్యాంపు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు రెండు సార్లు మోసపోయారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనుని అంతా అనుకుంటే.. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే న్యాయం జరిగిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయల నష్ట పరిహారం అందిస్తామని చెప్పి ఇప్పటికీ అందించలేకపోయారని ఫైర్ అయ్యారు. రైతుల రుణమాఫీ అమలు ఊసే లేకుండా పోయిందన్నారు. ఈసారి కేసీఆర్ మాయ మాటలు చెప్తే నమ్మొద్దన్నారు. 


ఏ పార్టీలో చేరుతారన్నదానిపై ఉత్కంఠ


పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు. వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ గత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేయడానికి టిక్కెట్ లభించలేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ లోనే కొనసాగారు. వచ్చే  ఎన్నికల్లోనూ ఆయనకు టిక్కెట్ లబించే అవకాశాలు లేవని భావించడంతో ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన  బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారని గతంలో ప్రచారం జరగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయనకు ఆహ్వానం పంపారని చెబుతున్నారు. అయితే పొంగులేటి మాత్రం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు .. వైఎస్ విజయలక్ష్మితోనూ రెండు సార్లు సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. అయితే్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారా లేదా అన్న విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 


కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీపై నిర్ణయం 


అనుచరులు, ప్రజాభిప్రాయం ప్రకారమే పార్టీ మారే నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్వరావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరినా తన అనుచరులకు టికెట్ ఇచ్చే ధైర్యం ఉంది కాబట్టే అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రులు అంటే ఎన్టీఆర్, వైఎస్ఆర్ లా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని సీఎం కేసీఆర్ కు సెటైర్లు వేశారు. దమ్ముంటే తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌ చేయాలని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సవాల్ చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన  బీఆర్ఎస్ సభకు జనాన్ని ఎలా తరలించారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని స్పష్టం చేశారు. తన వర్గాన్ని ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ఆదివారం పొంగులేటితో భేటీ అయిన 20 మంది బీఆర్ఎస్ నేతలను పార్టీ సస్పెండ్ చేసింది.