హీరో సుశాంత్ తల్లి నాగ సుశీలపై పోలీస్ కేసు నమోదైంది. ఈమె హీరో నాగార్జునకు సొంత సోదరి. ఓ ఆశ్రమంపై దాడి చేశారనే ఆరోపణలతో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగసుశీలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై ఈ నెల 12న నాగసుశీల, ఆమె మనుషులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు దారు ఆరోపణలు చేశారు. దర్శపీఠ నిర్వహకుడు చింతలపూడి శ్రీనివాసరావుపై వీరు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నాగ సుశీలపై పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.


అయితే, గతంలోనూ నాగ సుశీల ఇలాంటి కేసుల్లో చిక్కుకున్నారు. నాగసుశీల గతంలో తన వ్యాపార భాగస్వామి అయిన చింతలపూడి శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు పెట్టారు. తమకు తెలియకుండా తమ భూమిని విక్రయించారని ఆరోపిస్తూ నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నాగసుశీల ఫిర్యాదు చేశారు. తన భూమిని అమ్మేసి ఆ వచ్చిన నగదు దుర్వినియోగం చేసినట్లు ఆమె ఆరోపించారు. లాకప్‌లో పెట్టయినా సరే తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని అప్పట్లో శ్రీనివాస్ ఆరోపించారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా తాము కొన్ని సినిమాలు తీశామని, వాటివల్ల భారీగా నష్టపోయామని శ్రీనివాస్ అన్నారు. ఈ వివాదాల కారణంగా శ్రీనివాస్ నాగసుశీలపై తాజాగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 


ఇద్దరూ వ్యాపారంలో పార్టనర్స్
అయితే, నాగసుశీల, శ్రీనివాసరావు కొన్నేళ్ల నుంచి వివిధ వ్యాపారాల్లో పార్టనర్స్‌గా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఓ సినిమా బ్యానర్ ను స్థాపించారు. శ్రీ నాగ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించి వీరు సినిమాలు తీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. వీరు కొన్ని సినిమాలు కూడా నిర్మించగా.. వాటిలో సుశాంత్‌ హీరోగా మూడు సినిమాలు తీశారు. ఆ సినిమాల్లో ఒక్క ‘కరెంట్’ సినిమా హిట్ అయినప్పటికీ ఆ తరవాత వచ్చిన అడ్డా అనే సినిమా ఆడలేదు. మూడో సినిమా ఆటాడుకుందాం రా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే, ల్యాండ్ విషయంలో వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు ఈ సినిమా పరాజయంతో మరింత ఎక్కువైనట్లు చెబుతున్నారు. ఈ సినిమా కోసం శ్రీనివాసరావు రూ.5 కోట్లు సమకూర్చినట్లు సమాచారం. అయితే మనస్పర్థలు ఎక్కువ అవడంతో వీరిద్దరి మధ్య దూరం కూడా పెరిగింది. ఆ క్రమంలోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని శ్రీనివాసరావు ఆరోపించిన్నట్లు తెలుస్తోంది.