Modi Telangana Visit: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణ అధికారం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ రాష్ట్రంలో వరుస పర్యటనలు, కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు కర్ణాటక ఎన్నికల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలు.. ఇక తెలంగాణపై ఫోకస్ చేయనున్నారు. సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తుండడంతో.. ఆ మరుసటి రోజున తెలంగాణకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు కర్ణాటకలో గెలుపు కీలకం అని అక్కడ ఓట్ల పొందే ఏ అవకాశాన్ని వదులుకోరాదనే వ్యూహం మేరకే సరిహద్దుల్లో సభ నిర్వహించే యోచన ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల కోడ్ తో ఇబ్బంది లేకుండా జహీరాబాద్, నారాయణపేట్ లేదా మరోచోట సభ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు అనేక వ్యూహాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై విమర్శల దాడిని కొనసాగించడంతో పాటు కేంద్రమంత్రులు, ముఖ్య నేతల పర్యటనల ద్వారా పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు. కేంద్ర పథకాల ద్వారా వివిధ రంగాల్లో రాష్ట్రానికి కేటాయించి నిధులు, ప్రజలకు కల్గిన లబ్ధి తదితర అంశాలను క్షేత్రస్థాయిలో వివరించాలని నిర్ణయించారు. 


గతనెలలో కూడా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని


ఏప్రిల్ 8వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా కేంద్ర బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకుని.. రైల్వే స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న వందేబారత్ సికింద్రాబాద్ నుండి తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్ ను ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం 10 నుండి ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌


అనంతరం రూ. 715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా రాబోయే 40 సంవత్సరాల వరకు అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. రద్దీ సమయంలో 3,25,000 మంది ప్రయాణికులకు కూడా సౌకర్యాలను అందించగలిగేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ ఫామ్స్‌ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెన చేపడుతున్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రేతిఫైల్ బస్ స్టేషన్ కు నేరుగా కనెక్టివిటీని పెంచుతారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, వచ్చే/వెళ్ళే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాలను అభివృద్ధి పనులలో భాగంగా చేపడుతున్నారు.