Telangana Elections 2023: హైదరాబాద్: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. నవంబర్ 25వ తేదీన మహేశ్వరం, కామారెడ్డి సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్ లో బీజేపీ నిర్వహించనున్న సభల్లో, ఈ 27న మహబూబాబాద్, కరీంనగర్ లో బీజేపీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్ షో లో మోదీ పాల్గొంటారని పీఎంఐ ఓ ప్రకటనలో తెలిపింది.


తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్
తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా, బీజేపీ (BJP) తరఫున పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారం చేయనున్నారు. జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బుధవారం బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సిటీలో రోడ్ షోలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనుండగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను జనసైనికులు పూర్తి చేశారు. అనంతరం వరంగల్ తూర్పు అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు తరఫున కూడా ప్రచారం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


నవంబర్ 23న (గురువారం) కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో ప్రచారంలో పాల్గొంటారు. ఈ నెల 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ కు మద్దతుగా, 26న కూకట్పల్లి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రధాని మోదీ పాల్గొనే సభల్లోనూ పవన్ పాల్గొననున్నారు. ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీ హాజరు కాగా, పవన్ కల్యాణ్, మందకృష్ణ కూడా పాల్గొన్నారని తెలిసిందే.


అక్టోబర్ 1, 3 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించారు. రెండ్రోజుల పర్యటలో భాగంగా అక్టోబర్ 1న జరిగే మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా రూ.13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ.6,404 కోట్లతో చేపట్టే కొత్త జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఉన్నాయి.  ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 


మునీరాబాద్- మహబూబ్ నగర్ ప్రాజెక్టులో భాగంగా జక్లేర్ నుండి కృష్ణా వరకు కొత్తగా నిర్మించిన రూ.505 కోట్ల విలువైన రైల్వే లైనును ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ - గోవాల మధ్య దూరం 102 కిలోమీటర్ల వరకు తగ్గింది. కాచిగూడ- రాయచూరు మధ్య డెము సర్వీసును కూడా మోదీ ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌లో హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ పైపులైన్‌ను సైతం మోదీ జాతికి అంకితం చేశారు. 3న నిజామాబాద్ లో జరగనున్న మీటింగ్ కు హాజరయ్యారు.


Also Read: బోర్లకు మీటర్లు ఫిక్స్ చేయలేదు, అందుకే నిధులు కట్ చేశాం - నిర్మలా సీతారామన్