Bandi Sanjay Highcourt :   బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు, పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో పిటీషన్ వేసింది బీజేపీ లీగల్ సెల్. ఎంపీగా బండి సంజయ్ ను అర్థరాత్రి బలవంతంగా, అక్రమంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లటాన్ని సవాల్ చేస్తూ ఈ పిటీషన్ వేసింది పార్టీ లీగల్. ఏప్రిల్ 5వ తేదీన.. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి ప్రక్రియను మాత్రం ఏప్రిల్ 6వ తేదీ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు.


ఈ పిటీషన్ లో మొత్తం ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చారు. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, బొ మ్మల రామారం సీఐలను ప్రతివాదులుగా ఉన్నారు. హెబియస్ కార్పస్ పిటీషన్ విచారణకు వచ్చే ముందే.. ఎంపీ బండి సంజయ్ ను అరెస్ట్ చూపించారు పోలీసులు.  తర్వాత హనుమకొండ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ఈ పిటీషన్ పై ఏప్రిల్ 6వ తేదీన వాదనలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.


అత్యవసరంగా దాఖలు చేసిన పిటీషన్ ను హౌస్ మోషన్ లో విచారించేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. రేపు రెగ్యులర్ బెంచ్ లోనే వాదనలు వింటామని స్పష్టం చేసింది. డివిజన్ బెంచ్ లోనే ఈ పిటీషన్ పై విచారణ జరగనుంది. కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లినప్పటి నుంచి.. ఆ తర్వాత జరిగిన అన్ని పరిణామాలను ఈ పిటీషన్ లో స్పష్టం చేసింది బీజేపీ లీగల్ టీం. బండి సంజయ్ ను కోర్టులో హాజరుపరిచిన క్రమంలో.. అక్రమ అరెస్టుపైనే ప్రధానంగా విచారణ జరగనుంది.


బండి సంజయ్‌పై ఒక కేసు కరీంనగర్ 2 టౌన్ లో.. మరో కేసును వరంగల్ కమలాపూర్ లో నమోదు చేశారు. బండి సంజయ్ అరెస్ట్ ను ఈ మేరకు ధృవీకరించారు వరంగల్ సీపీ రంగనాథ్. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి అరెస్ట్ చేశామని.. అర్థరాత్రి 12 గంటల 15 నిమిషాలకు ఎఫ్​ ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారాయన.  పేపర్ లీకేజీలో, ప్రచారం వెనక ఎంపీ బండి సంజయ్ పాత్ర ఉందని.. కుట్రదారుడిగా పేర్కొంటూ.. అతనిపై 420, 120(బి), సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.  సీఆర్‌పీసీ 154, 157  సెక్షన్ల ప్రకారం అభియోగాలు నమోదు చేశారు.


బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను హనుమకొండ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు.  కోర్టు వెనుక గేటు నుంచి సంజయ్ ను లోపలికి తీసుకెళ్లారు పోలీసులు  దీంతో అక్కడ హై టెన్షన్  నెలకొంది. ఏప్రిల్ 05 మంగళవారం అర్థరాత్రి  సమయంలో సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు  కొద్దిసేపటి క్రితమే కోర్టు ముందు హాజరుపరిచారు.  బీజేపీ కార్యకర్తలు కోర్టు దగ్గరికి భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  కోర్టు దగ్గర భారీగా  పోలీసులు కూడా మోహరించారు. వరుసగా కాన్వాయ్ లు మారుస్తూ  సంజయ్ ను తిప్పుతున్న పోలీసులు సాయంత్రం నాలుగు  గంటల సమయంలో కోర్టు  ముందు హాజరుపరిచారు.