Revanth Reddy : పరకాల నియోజకవర్గం పోరాటాల గడ్డ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పరకాల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గడ్డ పరకాల అన్నారు. అలాంటి ఈ గడ్డపై దళారులు, దండుపాళ్యం ముఠా కట్టి దోచుకుంటున్నాయని విమర్శించారు. ఇక్కడి ఎమ్మెల్యే పేరులోనే ధర్మం ఉంది కానీ ఆయన బుద్దిలో లేదన్నారు. ఈ ఎమ్మెల్యే  దందాల రెడ్డి సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. ఇక్కడ మొత్తం కాంట్రాక్టులు ధర్మా రెడ్డివే అని ఆరోపించారు. ఏ దోపిడీలో చూసినా ధర్మా రెడ్డి పేరే వినిపిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వలే, దళితులకు మూడెకరాలు ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలో పేదలకు ఒరిగిందేం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. మరి 23 లక్షల కోట్లు ఎవరింటికి పోయినయ్ అని ప్రశ్నించారు. పరకాల అభివృద్ధి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిందే అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు.  


ప్రగతి భవన్ లోకి పేదలను రానివ్వడంలేదే? 


"వరి వేస్తే ఉరే అని కేసీఆర్ చెబుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అడుగుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో వరంగల్ ఏకశిల పార్కు దగ్గర చర్చ పెడదాం. నేను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా. మీరు చెప్పింది తప్పైతే ప్రజలకు క్షమాపణ చెబుతారా?. నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా.. ప్రతీ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ కట్టినవే. సిద్దిపేట చింతమడకలో గుడి, బడి నీళ్ల ట్యాంక్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. హైటెక్ సిటీ, శిల్పారామం, మెట్రో రైల్, దేశంలో రైల్వే స్టేషన్లు మేం కట్టినం. పేపరు మిల్లులు మేం కడితే మీ అయ్య వచ్చి వాటిని మూతపడేశారు. మీరు ఫామ్ హౌసులు కట్టుకున్నారు.  వేలాది ఎకరాలు ఆక్రమించుకున్నారు తప్ప పేదలకు చేసిందేం లేదు. నిజంగానే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నీ కుటుంబమే అయితే. 10 ఎకరాలలో కట్టుకున్న ప్రగతి భవన్ కు పేదలను ఎందుకు రానివ్వడం లేదు?. 12 వందల మంది అమరవీరుల కుటుంబాలలో ఏ ఒక్కరికైనా ఇంటికి పిలిచి  బుక్కెడు బువ్వ పెట్టారా?. నిజంగా తెలంగాణ ప్రజలు మీ కుటుంబమే అయితే ..పీజీ విద్యార్థి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? అయిదు రోజులైనా నేరస్తులను పట్టుకుని ఎందుకు శిక్షించలేదు? నీ ఇంట్లో బిడ్డను ఎవరైనా చంపితే ఇలాగే చేస్తారా?. ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా చూడటానికి రాని మీకు ఎలా మేం కుటుంబ సభ్యులం అవుతాం? అయినా నువ్వు మా కుటుంబం అనుకుంటే..  పరకాల సాక్షిగా మా తెలంగాణ కుటుంబం నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం" - రేవంత్ రెడ్డి


తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ 


మా తెలంగాణ కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తెచ్చామని చెప్పుకున్నవారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండని కోరారు. సోనియా కలలుగన్న తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు లేని ప్రతీ పేదకు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ఏడాది వడగండ్ల వానకు 300 కోట్ల పంట నష్టం జరిగిందన్నారు. వచ్చి చూసి వెళ్లిన మంత్రులు ఇప్పటివరకు పరిహారం అందించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రైతులకు పంట నష్టం చెల్లించే బాధ్యత మేం తీసుకుంటామన్నారు.


సీతక్క సంచలన వ్యాఖ్యలు 


వరంగల్ జిల్లా పరకాల సభలో ములుగు ఎమ్యెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు రోజుల పాటు వైద్య విద్యార్థి ప్రీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, యంత్రాంగం అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.  ప్రీతి ఎప్పుడో చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. అధికారులు ఈ విషయాన్ని దాచారన్నారు.