BRS News :  భారత రాష్ట్ర సమితి ఒడిషా శాఖ ఇంచార్జ్ గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన అంత యాక్టివ్‌గా లేరు. అదే సమయంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా ఒడిషాలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టలేదు.    ఒడిషా బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ తన అనుచరులతో కలిసి రాజీనామలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఢిల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. దీంతో ఒడిషాలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఆరంభశూరత్వంగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.                                                                               


టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత పలు రాష్ట్రాల్లో కీలక నేతల్ని చేర్చుకోవాలని కేసీఆర్ ప్రయత్నించారు.  ఒడిషాలో పార్టీ విస్తరణ కోసం మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కుటుంబాన్ని ఒప్పించారు. జనవరిలో ఒడిషా నుంచి ప్రత్యేక విమానాల్లో వారందర్ని హైదరాబాద్‌కు పిలిపించి కండువాలు కప్పారు. ఒడిషా చీఫ్ గా నియమించారు.  ఒడిషాలో భారీగా పార్టీ ఆఫీసు ప్రారంభిస్తామని బహిరంగ సభ కూడా ఏర్పాటు చే్స్తామని కేసీఆర్ చెప్పారు. పార్టీ ఆఫీసు కోసం వెదికే పని అప్పట్లోనే పార్టీలో చేరిన రావెలకిషోర్ కు అప్పగించారు. తర్వాత రావెల కిషోర్ కూడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.  


బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణను పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం మహారాష్ట్రపైనే దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల మహారాష్ట్ర, తెలంగాణలోని లోక్ సభ సీట్లు గెల్చుకుని కేంద్రంలో చక్రం తిప్పుతామని చెబుతున్నారు కానీ ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరిస్తామని చెప్పడం లేదు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ శాఖలకు ఇంచార్జులను నియమించిన ఆ రాష్ట్రాల వైపు కేసీఆర్ కన్నెత్తి చూడలేదు. ఏపీలో బీఆర్ఎస్ ఆఫీసును ఇంచార్జ్ గా ఉన్న  తోట చంద్రశేఖరే ప్రారంభించుకున్నారు. తెలంగాణ సీనియర్ నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఒడిషాలో అసలు ఆఫీసే ప్రారంభం కాలేదు. కేసీఆర్ ఆపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోతూండటంతో..గిరిధర్  గమాంగ్ ఇక తమ దారి తాము చూసుకోవాలనుకున్నారని ఒడిషా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.                               
 
గిరిధర్ గమాంగ్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ లోకి వారు బీజేపీ నుంచి వచ్చి చేరారు. కానీ గమాంగ్ కుటుంబం.. సంప్రదాయంగా కాంగ్రెస్ కు చెందిన వారు. ఎంపీగా గిరిధర్ గమాంగ్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు. అయితే తర్వతా కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో బీజేపీలో చేరారు. అక్కడా నిరాదరణ ఎదురుకావడంతో...బీఆర్ఎస్ లోచేరారు.చివరికి మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు.