Kamareddy Master Plan Issue : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేసుకోవాలని గత నెల రోజులుగా కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. కామారెడ్డి లో రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయం అన్నారు. 


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వల్ల రైతులకు నష్టం
మాస్టార్ ప్లాన్ లో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడం వల్ల కొద్దిగా భూములు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో మునిసిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు పెట్టి రైతులతో చర్చించకుండా అధికారులు రైతుల అభిప్రాయం సేకరించకుండా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతుల ఉద్యమం నెల రోజులుగా నడుస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునకు నిదర్శనం అన్నారు.


రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రాణ సమానమైన భూములను కాపాడుకునేందుకు కలెక్టర్ తో చర్చించేందుకు వస్తే కలెక్టర్ కనీసం రైతులతో మాట్లాడేందుకు నిరాకరించడం ప్రజల పట్ల ఈ పాలకులకు ఉన్న నియంత ధోరణికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ‘ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలి. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రైతుల ముందు పెట్టి ప్రజా సభ లలో చర్చించి ప్రజల మద్దతుతోనే అమలు చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. కలెక్టరేట్ల వద్ద జరిగిన రైతు, పోలీసులకు మధ్య ఘర్షణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది.  కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  మాస్టర్ ప్లాన్ నిర్ణయంతో బుధవారం  రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఉపసర్పంచ్ సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పిఏసీఎస్ డైరెక్టర్, ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు రాజీనామా చేశారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  


కామారెడ్డి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లిన రైతులు 
 
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు తెలిపారు. రైతుల ధర్నా కొనసాగుతోంది. రాములు మృతికి సంతాపంగా రైతులు మౌనం పాటిస్తుండగా అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త జనార్దన్ రెడ్డి వారు దాడికి యత్నించారు. రాజీనామా చేయకుండా ర్యాలీ వద్దకు ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను సముదాయించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన రైతులు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బారికేడ్లు దాటిలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.   ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.