Nizamabad News :  ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరు పడిన నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో పూర్వ వైభవం కోసం నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం  రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో సత్తా చాటాలనుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రోజు చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తిగాని కంటిన్యూ చేసేలా హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. 


రాహుల్ యాత్ర తో పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు సంతోషంగా ఉన్నారు.  అలాగే తెలంగాణలో అన్ని జిల్లాల్లో రేవంత్ రెడ్డి చేపడతున్న పాదయాత్రతో మంచి ఊపు వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 13 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఏబీపీ దేశంతో తెలిపారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఎలాంటి వర్గ విభేధాలు లేవన్నారు మహేష్. నేతలంతా ఏకతాటిపై ఉన్నామని... జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రను సక్సెస్  చేస్తామని ధీమా వ్యక్తం చేసారు.  
రాహుల్ జోడో యాత్రను స్పూర్తిగా తీసుకున్న తాము రాష్ట్ర అధిష్టానం జిల్లాల్లో తలపెట్టిన పాదయాత్రలకు మంచి స్పందన వస్తోందని జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉందని అన్నారు.


అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ..  రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని అన్నారు మహేష్. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం నొక్కేసింది. ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టేందుకే రేవంత్ పాదయాత్ర నడుస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీలేదన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ హాయాంలోనే మెడికల్ కాలేజీ, తెలంగాణ యూనివర్సిటీ వంటివి తీసుకోచ్చామన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలనను కాంగ్రెస్ ఎక్కడిక్కడ ఎండగడుతూ వస్తోందన్నారు. ప్రజల సమస్యలపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటోందని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ హయాంలోనే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును జిల్లాలో చేపట్టాం. 1.5 టీఎంసీ సామర్ధ్యంతో మంచిప్ప రిజర్వాయర్ డిజైన్ రూపకల్పన చేశాం. ఇవాళ డబ్బులు దండుకునేందుకు మంచిప్ప రిజర్వాయర్ రీడిజైన్ పేరుతో ఆయా గ్రామాల ప్రజలను నష్టపరిచే విధంగా చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు మహేష్. మంచిప్ప సహా 9 గ్రామాల ముంపు ప్రాంత ప్రజలు నష్టపోకుండా ... రీ డిజైన్ ను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారు మహేష్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంచిప్ప రిజర్వాయర్ ను సందర్శించనున్నారు. ఆయా ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి బీజేపీ పసుపు రైతులను మోసం చేసింది. పసుపు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు మహేష్. 


నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వవైభవం తెచ్చే దిశగా జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఎలాంటి విభేధాలు లేకుండా ఏకతాటిపైకి వచ్చామని అన్నారు మహేష్ గౌడ్. ఇప్పటికే రేవంత్ పాదయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను సైతం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారని తెలిపారు మహేష్. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.