ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ సంస్థతోపాటు  ప్రైవేట్ బస్సులు పెద్ద సంఖ్యలో నడుపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 6 ఆర్టీసీ డిపోలో సుమారు 627 బస్సుల్లో ప్రయాణికులు నిత్యం తమ గమ్యం చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి వారి గ్రామాలకు సురక్షితంగా ప్రయాణికులను చేరవేస్తున్నామని ఆర్టీసీ అధికారులు కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. 


ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారులు లోకల్‌గానే బస్సులు నడుపుతున్నారనే విమర్శ గట్టిగానే వినిపిస్తోంది. అంతర్రాష్ట్ర సర్వీసులు పూర్తిగా నిలిపేశారని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. మహారాష్ట్రలోని అకోలా, ఔరంగాబాద్, పండర్ పూర్, నాగపూర్, నాందేడ్, షిరిడి, పూణే వంటి నగరాలకు నిజామాబాద్ జిల్లా నుంచి వేల మంది ప్రయాణికులు ఇతర రాష్ట్రాల బస్సుల్లోనే ప్రయాణం కొనసాగిస్తున్నారు. కర్ణాటకలోని బెంగళూర్, బీదర్ బస్సులు అధిక సంఖ్యలో తెలంగాణ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కానీ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఆర్ టి సి సంస్థ మాత్రం అలాంటి ప్రయత్నమేదీ చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గత 2003-2004 సంవత్సరం నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపడంలో పూర్తిగా విఫలం అయ్యారని అంటున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సులు నడపకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ ఆడింది ఆటలా సాగుతోంది. దీంతో ఆర్టీసీకి భారీ మొత్తంలో ఖజానాకు గండి పడుతుంది. 2003 -2004 సంవత్సరం నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఆర్టీసీ సంస్థ బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిపివేయడంతో వలస కార్మికులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రైవేట్ బస్సుల యజమాన్యం ఆసరాగా తీసుకొని అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అంతర్రాష్ట్ర సర్వీసులు నడపాలని ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయ్. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్నది లోకల్‌గా వినిపిస్తున్న మాట. ఇతర రాష్ట్రాలకు నడిచే ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ యజమానుల తీరులో ఏ మాత్రం మార్పు రావటం లేదంటున్నారు. ముంబై, చెన్నై ,మద్రాస్, వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వారు వేసే ఛార్జీలను భరించలేకపోతున్నారు.


ఇకనైనా ఆర్టీసీ సంస్థ చైర్మన్‌తోపాటు సంబంధిత అధికారులు ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికులను దోపిడీ చేస్తున్న వారిని అరికట్టాలని వేడుకుంటున్నారు స్థానిక ప్రజలు. ముంబై, చెన్నై, కర్ణాటక వంటి దూరప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు.