Pocharam Project in Kamareddy: కామారెడ్డి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులలో పోచారం ప్రాజెక్టు ఒకటి. ప్రాజెక్టుకు వందేళ్ల ఘన చరిత్ర ఉంది. నిజాం ప్రభుత్వంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉంటూ రెండు మండలాల పరిధిలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. పోచారం ప్రాజెక్టు సరిగ్గా ఈ ఏడాదికి ఈ ప్రాజెక్టు వందేళ్లు పూర్తి చేసుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని అలుగు దూకుతూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. ప్రాజెక్టు పర్యాటక స్థలంగా ఆకట్టుకుంటోంది. ప్రాజెక్టు పక్కన ఉన్న పోచారం అభయారణ్యం పర్యాటకులను మరింత ఆకర్షిస్తూ వస్తోంది. విదేశాల నుంచి వచ్చే లవ్‌బర్డ్స్‌కు ఈ ప్రాజెక్టు ప్రతి వేసవిలో ఆతిథ్యం ఇస్తోంది. ఇలా ఈ ప్రాజెక్టు వందేళ్లనాటి ఘన చరిత్రతో సాగు నీటిని అందించడమే కాకుండా వలస పక్షులకు ఆతిథ్యం ఇస్తూ పర్యాటక స్థలంగా సంతరించుకుంటుంది.


కామారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతమైన నాగిరెడ్డిపేట మండలంలో పోచారం గ్రామం వద్ద అప్పటి నిజాం ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నిజాం ప్రభుత్వం ఇంజనీర్‌ నవాబ్‌ జంగ్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో పోచారం ప్రాజెక్టు రూపకల్పన చేశారు. 1917 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను నిజాం ప్రభుత్వం ప్రారంభించింది. 1922 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేశారు. అప్పట్లో రూ.27.11 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 2.424 టీఎంసీలతో 21 అడుగుల ఎత్తులో 1.7 కిలో మీటర్ల పొడవుతో ప్రాజెక్టు ఆయకట్టు నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రాళ్లు, దంగుసున్నం మాత్రమే ముడిసరుకుగా వినియోగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సరిగ్గా 2022 నాటికి ఈ ప్రాజెక్టు వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంది. వందేళ్లుగా ఈ ప్రాజెక్టు చెక్కు చెదరకుండా మంచి పర్యాటక స్థలంగా, చుట్టు పక్కల పంట పొలాలకు సాగునీరు అందిస్తూ వస్తోంది. ప్రాజెక్టులో క్రమేపి పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం 1.860 టీఎంసీలకు చేరింది.


ఎల్లారెడ్డి డివిజన్‌లోని నాగిరెడ్డిపేట్‌, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని సాగు నీటిని అందించేందుకు నిజాం కాలంలో పోచారం గ్రామ శివారులోని మంజీరా వాగుపై ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు దిగువన నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో ఉన్న భూములకు సాగు నీటిని అందించేలా అప్పట్లోనే 58 కిలో మీటర్ల పొడవుతో కాలువలను తవ్వించారు. దీనికి 73 డిస్ర్టిబ్యూటర్‌లను సైతం విభజించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 17 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ప్రాజెక్టు ఆయకట్టు రెండు జోన్లుగా విభజించారు. నాగిరెడ్డిపేట మండలానికి చెందిన 1 డిస్ట్రిబ్యూటరీ నుంచి 48 డిస్ట్రిబ్యూటరీ వరకు ఏ జోన్‌గాను, ఎల్లారెడ్డి మండలానికి చెందిన 49 డిస్ట్రిబ్యూటరీ నుంచి 73 డిస్ట్రిబ్యూటరీని బీ జోన్‌గా విభజించారు. ప్రతీ ఏటా వానాకాలం సీజన్‌లో రెండు జోన్లకు సాగునీరు అందిస్తుండగా యాసంగి సీజన్‌లో మాత్రం ఒక సంవత్సరం ఏ జోన్‌కు మరో సంవత్సరం బీ జోన్‌కు సాగునీరు అందిస్తున్నారు.


పోచారం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా సంతరించుకుంటుంది. వానాకాలం వచ్చిందంటే ఎగువన ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో లింగంపేట పెద్ద చెరువు గుండా వరద వచ్చి చేరుకుంటుంది. గత ఐదేళ్ల నుంచి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో అలుగు దూకుతుండడంతో పర్యాటకుల తాకిడి పెరుగుతూ వస్తోంది. ప్రాజెక్టు నిండుకుందంటే చాలు జలజల జలపాతంలా ప్రాజెక్టు అలుగుపై నుంచి దూకుతుండగా ఆ అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. నిజాం హయాంలో నిర్మించిన జలాశయం అలుగు పారే దృశ్యాలు చూడటం మరింత కనువిందు చేస్తోంది. అదే జలాశయంలో బోటింగ్‌ చేయడం ఓ మధురానిభూతి. ఆదివారం, వీకెండ్‌ సెలవులు వచ్చాయంటే చాలు పోచారం ప్రాజెక్టు, అభయారణ్యం ప్రాంతాలు పర్యాటకులతో సందడి నెలకొంటుంది. ప్రాజెక్టు జలపాతం అందాలే కాకుండా మరోవైపు పోచారం అభయారణ్యంలో వన్య ప్రాణులు, అటవీ ప్రాంతం, ఇంకోవైపు పంట పొలాలు ఉన్న పోచారం ప్రాజెక్టు అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.  పోచారం ప్రాజెక్టు, అభయారణ్యం హైదరాబాద్‌ మహా నగరానికి దగ్గర ఉండటంలో సెలవు దినాల్లో ఈ ప్రాంతానికి వందల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు


లవ్‌బర్డ్స్‌కి ప్రాజెక్టు ఆతిథ్యం పోచారం ప్రాజెక్టు చుట్టూ అభయారణ్యం, పచ్చని పంట పొలాలు ఉండటంతో లవ్‌బర్స్డ్‌ లాంటి వలస పక్షులకు ప్రాజెక్టు ఆతిథ్యం ఇస్తోంది. విదేశాల నుంచి నవంబరు, వేసవి మాసాల్లో ఈ లవ్‌బర్ట్స్‌లు సేద తీరేందుకు పెద్దసంఖ్యలోనే ప్రాజెక్టుకు వచ్చి చేరుతాయి. ఉదయం, సాయంత్రం సమయంలో ఈ లవ్‌బర్డ్‌ పక్షులు ప్రాజెక్టులోని జలాశయంలో కనువిందు చేస్తుంటాయి. వీటిని చూసేందుకు కామారెడ్డి, మెదక్‌, హైదరాబాద్‌ లాంటి నగరం, పట్టణాల నుంచి పెద్దసంఖ్యలోనే పర్యాటకులు వస్తుంటారు. ప్రతీ సంవత్సరం ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో లవ్‌బర్డ్ప్‌తో పాటుగా ఇతర పక్షులు వలసకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. 


 కామారెడ్డి, మెదక్‌ ఉభయ జిల్లాలకు పర్యాటక ప్రాంతాలుగా మారిన పోచారం ప్రాజెక్టు, అభయారణ్యాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తామని గత ప్రభుత్వాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం సైతం హామీ ఇచ్చింది. కానీ పర్యాటక స్థలంగా మాత్రం మారడం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఆరేళ్ల కిందట పోచారం ప్రాజెక్టుతో పాటు అభయారణ్యాన్ని పర్యాటక స్థలంగా మార్చేందుకు పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రాజెక్టులో బోటింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటు జలాశయం మధ్యలోనే పెద్దగుట్టపై హోటల్‌ను, గార్డెన్‌, మ్యూజియంను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. కానీ ఇప్పటి వరకు పర్యాటక స్థలంగా మార్చేందుకు ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టలేక పోయారు. పర్యాటకంగా తీర్చి దిద్దితే పోచారం ప్రాజెక్ట్ మంచి పర్యాటక స్పాట్ గా మారుతుంది. హైదరాబాద్ కు కూడా దగ్గరగా ఉండటంతో ఇక్కడి చాలా మంది వస్తారు. ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది.