Pawan Kalyan On Annamalai: రాజకీయాల్లో అధికారం ఒక్కటే ముఖ్యం కాదని, సంబంధాలు, సిద్ధాంతాలు చాలా ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అన్నామలై లాంటి వ్యక్తి కోసం బీజేపీ మరింతగా ప్రయత్నించాల్సి ఉండాల్సిందని అన్నారు. ఆ ప్లేస్లో తాను ఉండి ఉంటే కచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధపడే వాడినని అన్నారు. తెలంగాణలో కూడా తన పార్టీ విస్తరణ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఉన్న ఓట్ ప్యాటర్న్ను గందరగోళపరచడం తమ సిద్ధాంతంకాదని, అక్కడి జనసైనికులు కోరిక మేరకే పార్టీన విస్తరిస్తున్నామని అన్నారు. కచ్చితంగా స్పేస్ ఏర్పాటు చేసుకుంటామని పేర్కొన్నారు.
అన్నామలై ఒక పవర్ఫుల్ లీడర్ అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ ఆయనను మరింత మెరుగ్గా హ్యాండిల్ చేయాల్సిందని అన్నారు. అన్నామలై లాంటి నాయకులు ఉన్నప్పుడే బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ముద్ర నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అన్నారు.
తమిళ నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలపై స్పందించారు. ఆయన రాక్ సాలిడ్ వ్యక్తి అని అన్నారు. విజయ్కి ఉన్న క్రమశిక్షణ, ప్రజలతో ఉన్న అనుబంధం ఆయనకు పెద్ద బలం అని తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యాన్ని ఆయన భర్తీ చేయగలరని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎన్డీఏ భాగస్వామిగా తాను అన్నామలైకి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. విజయ్ ఎదుగుదల కూడా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.
తెలంగాణలో జనసేన విస్తరణ పార్టీ నేతల కోరిక మేరకే...
తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తనకు తెలంగాణలో వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు లేవని, కేవలం తన కేడర్ కోసమే పార్టీని అక్కడ విస్తరిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో ఓట్లు చీల్చడం ద్వారా ప్రస్తుత రాజకీయ సమీకరణాలను దెబ్బ తీసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇక్కడ బీజేపీకి తగినంత స్పేస్ ఇచ్చానని, కానీ జనసేన కూడా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకోవాలని అన్నారు. తెలంగాణ గడ్డపైనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని అక్కడి కార్యకర్తల కోరిక మేరకే పార్టీ ముందుకు వెళ్తుందని స్ఫష్టం చేశారు.
ప్రాంతీయ పార్టీలు తరచుగా కేవలం తమ రాష్ట్రాలకే పరిమితమై జాతీయ ప్రయోజనాలను విస్మరిస్తుంటాయని, కానీ జనసేన మాత్రం ప్రాంతీయ ఆకాంక్షలతో పాటు జాతీయ భావజాలాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందని పవన్ వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో కొనసాగుతుందని, దేశ నిర్మాణంలో భాగ్వామ్యం కావడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు.
ప్రధాని మోదీ ఒక నాయకుడి కంటే ఎక్కువ
ప్రధానమంత్రి మోదీకి తనపై ఉన్న అభిమానంపై పవన్ స్పందించారు.మోదీ తనకు గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి తెలుసు అని అన్నారు. అప్పుడే ఆయన ఆలోచనలు చూసి ప్రధాని అయ్యే అవకాశం ఉందని అంచనా వేశానని అన్నారు. ఆయనతో ఎప్పుడూ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలే చర్చకు వస్తాయని చెప్పారు. ఈ మధ్య తన నివాసానికి వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగిందన్నారు. అయితే అన్నింటి కంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మోదీ గట్టిగా చెప్పారన్నారు. దాన్ని సూచనగా కాకుండా ఆర్డర్లా తీసుకోవాలని హెచ్చరించారన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఇదో నిదర్శనమన్నారు.
సాధారణంగా తరచూ మాట్లాడకపోయినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు కచ్చితంగా ఫోన్ చేసి పలకరిస్తారని పవన్ చెప్పారు. తన కుమారుడికి సింగపూర్ స్కూల్లో ప్రమాదం జరిగినప్పుడు తాను అరుకు లోయలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నాని గుర్తు చేశారు. అక్కడ ఫోన్ నెట్వర్క్ సరిగా లేదని తాను తన ఫ్యామిలీతో మాట్లాడక ముందే మోదీ తనకు ఫోన్ చేశారని అన్నారు. అంతా మంచి జరుగుతుందని ధైర్యంగా ఉండాలని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఒక ప్రధానిగా కంటే తండ్రిగా పడే వేదన బాగా కదలించిందని చెప్పారు.
దక్షిణాదిలో కీలకమైన నేతగా ఎదగాలంటే మీకు ఉన్న క్వాలిటీస్ ఏంటని ప్రశ్నించినప్పుడు అన్ని రాష్ట్రాలతో భాషలపై పట్టుందని, అక్కడి పరిస్థితులపై అవగాహన ఉందని, సమస్యల గురించి తెలుసని చెప్పుకొచ్చారు.
