నిజామాబాద్ నగర కార్పొరేషన్‌ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాకు నుడా పాలకవర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నుడా పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి వాటిని ముసాయిదాలో పొందుపర్చింది. కొత్త మాస్టర్‌ప్లాన్‌పై సుదీర్ఘంగా చర్చించి పాలకవర్గం అన్నింటికీ ఆమోదం తెలిపి... డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రిప్లానింగ్‌ అధికారులకు పంపించింది. ఈ ముసాయిదాను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త మాస్టర్‌ప్లాన్‌పై గెజిట్‌ విడుదల చేస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మాస్టర్‌ప్లాన్‌ త్వరలో వచ్చేవిధంగా నుడా పాలకవర్గం నిర్ణయం తీసుకుంది.


మార్పులు చేర్పులు


నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌ కొత్త మాస్టర్‌ప్లాన్‌ కోసం ఐదేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మాస్టర్‌ప్లాన్‌ను ఒక సంస్థకు అప్పజెప్పారు. ఆ సంస్థ అన్ని పరిశీలించిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో ప్రజల కోసం అందుబాటులో ఉంచింది. మాస్టర్‌ప్లాన్‌పై వివిధ డివిజన్‌లలోని కార్యాలయాల్లో అవగాహన కల్పించారు. కార్పొరేషన్‌ విస్తరించడం కోసం శివారు గ్రామాలను కూడా కలపడంతో కొత్త మాస్టర్‌ప్లాన్‌కు మళ్లీ మార్పులు చేశారు. శివారు గ్రామాలను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చి ప్రభుత్వానికి పంపించారు.


40 ఏళ్ల ప్రణాళికతో అభివృద్ధి


కొత్త మాస్టర్‌ ప్లాన్‌ పరిశీలించిన మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర అధికారులు నుడా గ్రామాలను కలుపుతూ మాస్టర్‌ప్లాన్‌లో చేర్చాలని కోరారు. వచ్చే నలభై ఏళ్ల వరకు జరిగే మార్పులకు అనుగుణంగా ఉపయోగడే విధంగా కొత్త మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా గతేడాది కాలంగా నుడా పరిధిలోని గ్రామాలను చేర్చి కార్పొరేషన్‌తోపాటు నుడా గ్రామాలకు ఉపయోగపడేవిధంగా ఈ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. నుడా పరిధిలోని గ్రామాల్లో ఈ ప్లాన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. వారి నుంచి 762 అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులను ముసాయిదాలో పొందుపర్చారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమలులోకి వచ్చేవిధంగా డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రి ప్లానింగ్‌ అధికారులకు పంపించారు.


ట్రాఫిక్ తిప్పలు తీరినట్టేనా!


దాదాపు నిజామాబాద్ నగరం మాస్టార్ ప్లాన్ 40 ఏళ్లు కావస్తోంది. అప్పటి మాస్టర్ ప్లానే ఇప్పటికీ అమలో ఉంది. నిజామాబాద్ నగరం దినదినం విస్తరిస్తోంది. జనాభా కూడా పెరిగింది. అందుకనుగుణంగా ప్రజలకు సౌకర్యంగా ఉండేవిధంగా రోడ్లను తీర్చిదిద్దాలి. ఇప్పటికే చాలా ఏళ్లు ముగిసింది. ఈ నయా మాస్టర్ ప్లాన్‌తోనైనా ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తగ్గతాయని భావిస్తున్నారు. రోడ్ల విస్తీర్ణం, కొత్త రోడ్లు మాస్టర్ ప్లాన్ తో రానున్నాయ్.