Nizam Sagar Project: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు. ఒకప్పుడు ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేది. సాగు నీరుకు ఎలాంటి ఢోకా ఉండేది కాదు. ఎప్పుడైతే ప్రాజెక్టు ఎగువన సింగూరు నిర్మించారు అప్పటి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు భారీ వరదలు వస్తే తప్ప నిండని పరిస్థితి. ఈ సారి కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారిగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని జలకళను సంతరించుకుంది. గతంలో ఎన్నడూ జూలైలో ప్రాజెక్టు నిండిన సందర్భాలు లేవు. 


ప్రాజెక్టు చరిత్ర.. 
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగు నీరందించే లక్ష్యంతో నిజాం రాజుల్లో ఏడవ వాడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామం వద్ద మంజీరా నదిపై 1923లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఇది 72 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 29.72 టీఎంసీల సామర్థ్యంతో 2.75 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో నిర్మాణం మొదలుపెట్టారు. ఇంజినీర్ నవాజ్ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో 1931లో ప్రాజెక్టు పూర్తి అయ్యింది. 3 కిలో మీటర్లు 14 అడుగుల వెడల్పుతో ప్రాజెక్టు ఆనకట్టను నిర్మించారు. ప్రస్తుతం నీటి నిల్వ 17.80  టీఎంసీలు గా ఉంది. ప్రాజెక్టు ప్రధాన కాలువ 155 కిలో మీటర్లు ఉంటుంది. మొత్తం కాలువలు 82, సబ్ కెనాల్స్ 863 ఉన్నాయ్. ప్రాజెక్టును నిజాం కాలంలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మీంచారు. 


ఉమ్మడి జిల్లాకు సాగునీరు 
ఉభయ జిల్లాలకు సాగు నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2లక్షల 75వేల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట్లో 2 లక్షల 31వేల ఎకరాలకు సాగు నీటిని అందించారు. ఆ తర్వాత  ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున ఇసుక మేటలు చేరడంతో నీటి సామర్థ్యం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం లక్షా 35 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తోంది. గుప్త, అలీసాగర్‌, బ్యాక్‌ వాటర్‌తో మరో లక్ష ఎకరాలకు నీరు అందుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1405 అడుగులు కాగా, 17.802 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.


గత ఐదేళ్లుగా నిజాంసాగర్‌ ఆయకట్టు కింద లక్షా 35వేల ఎకరాలకే సాగునీరు అందిస్తోంది. యాసంగిలో నీటి పారుదల, వ్యవసాయ శాఖ సంయుక్తంగా సమావేశాలు నిర్వహిస్తూ కేవలం లక్షా 15వేల ఎకరాలకే ప్రణాళిక నిర్వహించారు. 0 డిస్ర్టిబ్యూటరీ నుంచి 48 డిస్ర్టిబ్యూటరీ వరకు సాగునీరు అందిస్తూ ఉంది. వర్ని, బీర్కూర్‌, కోటగిరి, బాన్సువాడ ప్రాంతాల్లో ఆయకట్టు కింద బోరు బావుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రైతులు బోరు బావుల ఆధారంగా జూలై మొదటి వారంలో వరి నార్లను వేస్తున్నారు. 


ప్రాజెక్టు ఆయకట్టు కింద ఎక్కడ చూసినా పచ్చని పైర్లతో కళకళలాడుతోంది. యాసంగిలో నిజాంసాగర్‌ ఆయకట్టు కింద కేవలం లక్ష ఎకరాలకే సాగునీరు అందించినప్పటికీ వానాకాలంలో లక్ష్యానికి మించి వరినాట్లు వేయడం గమనార్హం. ఆయకట్టు కింద ఉన్న రైతులు వానాకాలంలో అధిక దిగుబడిపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఒక్క ఎకరం వరి సాగు చేయాలంటే రైతులు దాదాపు 20 వేల నుంచి 25 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి వరి నాట్లు వేసుకున్నారు. నిజాంసాగర్‌ను నమ్ముకున్న ఉభయ జిల్లాల రైతాంగం ఈ ఏడాది జూలై మాసంలోనే నిజాంసాగర్‌ నిండి పోవడంతో రైతుల ఆశలు చిగురిస్తూనే ఉన్నాయి. మంజీరా పరివాహక ప్రాంతం వెంట ఉన్న రైతులు గత 15 ఏళ్ల కిందనే లిప్టు ఇరిగేషన్‌ మోటార్లు ఏర్పాటు చేసుకుని సాగు భూములను సాగు చేసుకుంటున్నారు. 


టూరిస్టు ప్లేస్ గా నిజాంసాగర్ ప్రాజెక్టు 
నిజాంసాగర్ ప్రాజెక్టు ఈ సారి జూలైలోనే నిండుకుండను తలపిస్తుండటంతో పర్యాటకులను సైతం ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు ప్రాజెక్టు నిండేది. అది కూడా భారీ వర్షాలు కురిస్తేనే... ఈ సారి ప్రాజెక్టు త్వరగా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవటంతో అన్నదాతల్లోనూ ఆనందం వెళ్లివిరుస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటకులను ఎంతో అలరిస్తుంది. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది. వీకెండ్స్ లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్టు పరిసరాల్లో పార్క్ ఉంటుంది. ప్రాజెక్టుకు ఎగువ భాగాన గోల్ బంగ్లా చూపరులను ఆకర్షిస్తుంది. ప్రాెజెక్టు నిర్మాణం సమయంలో ప్రాజెక్టు పనులను వీక్షించేందుకు గోల్ బంగ్లాను నిర్మించారు. ఇప్పుడది పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. హైదరాబాద్ నుంచి కూడా వీకెండ్స్ లో సందర్శకులు పెద్ద సంఖ్యలో ఇక్కడి వచ్చి ప్రాెజెక్టు ఆందాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. మరోవైపు నిజాంసాగర్ పార్క్ ను మరింత డెవలప్ చేయాలని కోరుతున్నారు జిల్లా వాసులు.