Minister Vemula: గత కొన్ని రోజుల నుండి ఏక ధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా మొత్తం జలమయంగా మారింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం సందర్శించారు. మంత్రి వేములతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అందరూ కలిసి బాబన్ సాబ్ పహాడీ, బోధన్ రోడ్డులో గల ఫ్రూట్ మార్కెట్, బైపాస్ రోడ్, గంగస్థాన్ తదితర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు.


వైద్య శిబిరాలు కొనసాగిస్తూనే ఉండండి..


అంతే కాకుండా ముంపు బాధితులకు వసతి కల్పించిన బోధన్ రోడ్డులోని రేయాన్ ఫంక్షన్ హాల్, గూపన్ పల్లిలో గల ఇంపీరియల్ గార్డెన్ లో కొనసాగుతున్న పునరావాస కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ముంపు బాధితులను పలుకరిస్తూ, వారికి అందిస్తున్న వసతి, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం, బ్లాంకెట్స్ ఇత్యాది సదుపాయాలు కల్పిస్తున్నారని ముంపు బాధితులు తెలుపగా... ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులను సంప్రదించాలని మంత్రి వారికి సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, భోజనం, వసతి సదుపాయాల కోసం నిధుల కొరత లేదని, పది వేల మందికైనా సరే ప్రభుత్వ పరంగా ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 


గంగస్థాన్, ఫులాంగ్ వాగు, బాబన్ సాబ్ పహాడీ వద్ద గల కాలువల్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి వేముల... కెనాల్ లకు ఆనుకుని ఉన్న నివాసాల్లోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.  కాగా, బాబన్ సాబ్ పహాడీకి వెళ్లే మార్గంలో గల ఇరుకైన వంతెన వల్ల రాకపోకలకు అనునిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం సమర్ధవంతంగా చేపట్టిన ముందస్తు చర్యల వల్ల పలు చెదురుముదురు ఘటనలు మినహా, భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగలేదని అన్నారు. ఇకముందు కూడా భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమై ఉందని తెలిపారు.  


ప్రజలు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, భారీ వర్షాల వల్ల జిల్లాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని నిలువరించేందుకు ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అయితే చెరువులన్నీ పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్నందున, అనేక చోట్ల రోడ్లపై నుండి పెద్ద మొత్తంలో వరద జలాలు ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వరద ప్రవాహంతో ఉన్న రోడ్లపై రాకపోకలు సాగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారు వెంటనే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందాలని, విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.