Vemula Prashanth Reddy News: కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకున్నా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఎదిగిందని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నరేంద్ర మోదీ అసమర్థ ప్రధాని అని, ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడని దుయ్యబట్టారు. 15 ఏళ్ల కింద 2జి స్పెక్ట్రం 1.70 లక్షల కోట్లకు అమ్ముడు పోతే వేలంలో అవినీతి జరిగిందని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అంతకు రెట్టింపు టెక్నాలజీ అయిన 5జీ స్పెక్ట్రం వేలం ఇప్పుడు కేవలం 1.40 లక్షల కోట్లకే తన మిత్రులు అదానీ, అంబానీకి కట్టబెట్టారని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 


ఇందులో 15 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, మిత్రుడు అదానీ స్వలాభం కోసం ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో 3 వేలకు దొరికే బొగ్గును 30 వేలకు కొనాలని విద్యుత్ డిస్కంలకు హుకుం జారీ చేశారని మండిపడ్డారు. ఇందులో 3లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని మంత్రి ఆరోపించారు. ఎల్ఐసీ, ఎస్బీఐ, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు మోదీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతూ దేశ సంపద దోచి పెడుతున్నాడని అన్నారు. మోదీ వల్ల దేశంలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్, కుల వృత్తులకు ప్రోత్సాహకాలు ఇలా అనేక పథకాలు ఇస్తూ ప్రజల ఇంట్లకే నేరుగా డబ్బులు పంపిస్తుంటే.. ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర ధరలు పెంచి ఇంట్లో ఉన్న పైసలు గుంజుకొని సామాన్య ప్రజలను గోస పెడుతున్నడని మండిపడ్డారు. 


బీజేపీ మోదీ పాలనలో దేశం అదోగతి పాలయ్యిందని అన్నారు. తెల్లారితే కేసిఆర్ ను విమర్శించే బండి సంజయ్ అసలు కేసీఆర్ పాలన గురించి మాట్లాడే అర్హతనే లేదని తేల్చి చెప్పారు. కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు పేరుతో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసి గెలిచిన ఎంపీ అరవింద్ పత్తాలేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాయకత్వంలో జనరంజక పాలన అందుతుందని, కేసిఆర్ తోనే దేశంలో, రాష్ట్రంలో అభివృద్ది సాధ్యం అవుతుందని మంత్రి వేముల స్పష్టం చేశారు.


ఆర్మూర్ అభివృద్ధి మాకు వదిలెయ్యండి.. జీవన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించండని ఆర్మూర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత చొరవతో ఆర్మూర్ ప్రాంత అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ అందిస్తానని మంత్రి చెప్పారు. నందిపేట సెంట్రల్ లైటింగ్ పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో చర్చిస్తానని, త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్మూర్ లో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారని మంత్రి తెలిపారు.