మంచిర్యాల జిల్లా జిల్లాలో అరుదైన సంఘటన జరిగింది. జన్నారం మండల కేంద్రంలోని తపాలపూర్ చెక్ పోస్ట్ దగ్గర ఉపాధి హామీ పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పని చెయ్యడానికి వెళ్లిన స్థానికులకు శ్రీరాముడు సీతాదేవి విగ్రహాలు మట్టి తవ్వుతుంటే దొరికాయి. ఇట్టి విషయాన్ని అదే గ్రామానికి చెందిన యువకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు ఆ విగ్రహాలని చూడడానికి వెళ్ళారు. 


అక్కడ అంతా హడావుడి ఉండటంతో విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు విగ్రహాలను పరిశీలించారు. పంచనామా నిర్వహించి, లా అండ్ ఆర్డర్ సమస్య ఉన్నందున భద్రత నిమిత్తం తపాలాపుర్ లోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో భద్రపరచడం జరిగిందని తహసిల్దార్ కిషన్ తెలిపారు. అయితే ఈ విషయం మీద నిజాం కాలేజీ హిస్టరీ విద్యార్థి, ప్రైవేట్ పురావస్తు పరిశోధకులు నితిన్ మాట్లాడుతూ.. ఇట్టి విగ్రహాల విషయం విశ్వసనీయవర్గాల సమాచారం వచ్చిందని, ఆ విగ్రహాలు పంచలోహ విగ్రహాలుగా అనుమానం ఉంది. వెంటనే ఆ విగ్రహాలను ప్రభుత్వ పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పూర్తి అధ్యయనం చేయాలని అన్నారు.


తపాలపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉపాధి హామీ కూలీలు పని చేస్తుండగా ఒక్కసారిగా ఏదో తగిలినట్టు అనిపించింది. దాంతో ఏంటో చూద్దామని మరికొంచెం లోతుకు తవ్వగా రెండు విగ్రహాలు  ఉపాధి హామీ కూలీలకు కనిపించాయి. విగ్రహాలను బయటికి తీసి చూడగా సీతారాములను పోలినట్లు గుర్తించారు. ఆ విగ్రహాలు 16వ శతాబ్దం నాటి సీతారాముల విగ్రహాలు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలా ఏదో ఓ చోట దేవుళ్ల విగ్రహాలు మన దేశంలో దొరుకుతూనే ఉంటాయి.


ఇంతకీ దేవుడికి తలనీలాలు ఎందుకిస్తారో తెలుసా!
భారతీయ హిందు సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు మొదలయ్యే శ్రీమంతం నుంచి  చనిపోయిన తర్వాత చేసే కర్మల వరకూ చేసే ప్రతి కార్యంలోనూ ఎన్నో నిగూఢమైన విషయాలు దాగి ఉన్నాయి. పెద్దలు చెప్పారు మేం పాటిస్తున్నాం అంటారుకానీ వాస్తవానికి అవెందుకు ఫాలో అవుతున్నామో , వాటి వెనుకున్న ఆంతర్యం ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిలో తలనీలాలివ్వడం ఒకటి. దేవుడికి మొక్కుకున్నాం గుండుచేయించుకున్నాం అని చెబుతారు కానీ ఇంతకీ మొక్కుకుంటే తలనీలాలు ఎందుకిస్తారు...ఎందుకివ్వాలి. 


తలనీలాలు అనగానే తిరుమల కళ్యాణ కట్ట గుర్తుకువస్తుంది. తిరుమల వెళ్లిన భక్తుల్లో దాదాపు 80శాతం భక్తులు తలనీలాలు ఇస్తారు. ఇలా ఇవ్వడం సంప్రదాయం అంటారు. చాలామంది పుట్టువెంట్రుకలు తిరుమలలోనే తీయిస్తారు. తిరుమల ఆలయంలో మాత్రమే కాదు చాలా ఆలయాల్లో కళ్యాణ కట్టలు ఏర్పాటు చేశారు. భక్తులు వారి వారి మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు. ఇంతకీ తలనీలాలు ఎందుకిస్తారంటే..శిరోజాలు పాపాలకు నిలయాలని, వాటిని తొలగించుకోవడం ద్వారా పాప ప్రక్షాళణ చేయించుకున్నవారు అవుతారని  పురాణాలు చెబుతున్నాయి.  గర్భంలో వున్న శిశువు తొమ్మిది నెలల తర్వాత భూమిపైకి వస్తాడు. ఆ శిశువికి ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసనలు అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే పుట్టువెంట్రులకు తీయడం (కేశ ఖండన) కార్యక్రమం నిర్వహిస్తారు.