Khanapur MLA Vedma Bhojju | ఇంద్రవెల్లి: అన్ని ఆదివాసి సంఘాలకు రాయి సెంటర్ వ్యవస్థ నాయకత్వం వహించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోని దర్బార్ హాలులో రాయిసెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని పేర్కొన్నారు. 5వ షెడ్యూల్ లో ప్రత్యేక అధికారాలు గవర్నర్ కు ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ఏజెన్సీ చట్టాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.


యువత సోషల్ మీడియాపై అవగాహన పెంచుకోవాలి


ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచులు తమ స్వార్థ రాజకీయ లబ్ది కోసం విచ్చల విడిగా పర్మిషన్లు ఇస్తున్నారని అన్నారు. ఆదివాసీ సమాజంలోని యువత సోషల్ మీడియాపై అవగాహన పెంచుకోవాలన్నారు. సోషల్ మీడియాలలో వచ్చే వదంతులని నమ్మొద్దని అన్నారు. జైనూర్ లో ఆదివాసీ మహిళపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఆ బాధిత మహిళతో పాటు జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కను తాను కలిశానని అన్నారు. ఆమెకు ఆసుపత్రిలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, బాధిత మహిళ ఆరోగ్య స్థితిగతులను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీలు సంయమనం పాటించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దోషికి కఠినంగా శిక్షిస్తుందని వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో ఆదివాసి సంఘాలను కల్పించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆదివాసీ సంఘాల సంయమనం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఉమ్మడి జిల్లా రాయిసెంటర్ సార్మేడీలు, అన్ని ఆదివాసీ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.


Also Read: Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!