Rekha Naik Resigns to BRS Party: 


భారత్‌ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీలు మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్ వీడనున్నారని బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన సమయంలోనే ప్రచారం జరిగింది. తనకు టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తికి లోనైన అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎట్టకేలకు శుక్రవారం నాడు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. 


కేసీఆర్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని ఆరోపించారు. పార్టీ తరఫున వరుస ఎన్నికల్లో గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తా అని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ తరఫున తాను బరిలోకి నిలుస్తానో త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. మరోవైపు రేఖా నాయక్ కు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన సమయంలోనే ఆమె భర్త శ్యామ్‌ నాయక్‌ కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. కేసీఆర్ నుంచి హామీ వస్తుందని ఆశించిన ఆమెకు భంగపాటు తప్పలేదు. దాంతో బీఆర్ఎస్ ను వీడాలని ఆమె నిర్ణయించుకున్నారు.


ఖానాపూర్ నియోజకవర్గానికి ACDP ద్వారా వచ్చే 2.24 కోట్ల నిధులను విడుదల చేయలేదని రేఖా నాయక్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకపోతే ఖానాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేస్తానని సైతం హెచ్చరించారు. వచ్చే నిధులను ఆపి తనను అణగ తొక్కడనికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ పై తీవ్రస్థాయిలో ఆమె మండిపడ్డారు. తన దగ్గర ఉన్న ఎస్.బి. కానిస్టేబుళ్లను కూడా తీయడం సరికాదని మండిపడ్డారు. ఖానాపూర్ లో మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు కావడానికి నేను ఎంతో కృషి చేశానని చెప్పారు.  నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను రెబల్ గా నైనా, ఇండిపెండెంట్ గా నైనా తప్పక పోటీలో ఉంటానని ఇటీవల చెప్పారు. అభివృద్ధి నేను చేస్తే గొప్పలు వారు వేరే వాళ్లు చెప్పుకోవడం సరికాదన్నారు.


తన భర్త పార్టీ మారారని, తాను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పినా వేధించారని ఎమ్మెల్యే ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తన అల్లుడు ఐపీఎస్ బదిలీపై స్పందిస్తూ రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశానని, నియోజకవర్గం కోసం కూడా పని చేశానని చెప్పారు.  9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని... అభ్యర్థి కోసం అభివృద్ధిని ఆపడం ఏమిటని ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని ఇలాంటి ధోరణి ఏదైనా ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని మార్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఛాన్స్ రాదని పార్టీకి రాజీనామా చేశారు.