సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుందని, ఆ ప్రాంతం ఊహించలేనంత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కామారెడ్డి ప్రాంతం రూపురేఖలు మారతాయని, కామారెడ్డి జిల్లానే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న జిల్లాలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.


శుక్రవారం రోజున కామారెడ్డి జిల్లాకు చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు హైదరాబాద్ లో కల్వకుంట్ల కవితతో సమావేశం అయ్యారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు తోడ్పడతామని వారు తెలియజేశారు.


ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చిందని, తమ ప్రాంతం మరింత అభివృద్ధితో దూసుకెళ్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని వివరించారు. ప్రత్యేక అభివృద్ధి నిధులతో కావాల్సినంత అభివృద్ధి చేసుకోవచ్చునని అన్నారు. పరిశ్రమలు, సంస్థలు వస్తాయని, దాంతో కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు. సాగునీటి వనరులు పెరుగుతాయని, రైతులు ఎంతో లాభపడతారని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసి గెలవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్ల అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. అగ్రవర్ణాలతో సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.  కామారెడ్డిలో భారీ మెజారిటీతో సీఎం కేసీఆర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పారు.


అయితే, కామారెడ్డిలోని రాజబహద్దూర్ వెంకట్రామి రెడ్డి ట్రస్టుకు ప్రతిపాదించిన రెండు ఎకరాల భూమిని ఐదు ఎకరాలకు పెంచి కేటాయిస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని రెడ్డి ఐక్యవేదిక నాయకులు ప్రస్తావించారు. భూ విస్తీర్ణాన్ని పెంచినందుకు సీఎం కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. భూ కేటాయింపు త్వరితగతిన జరిగేలా తాను చొరవ తీసుకుంటానని కవిత సానుకూలంగా స్పందించారు.


గరుకులాల ఏర్పాటు పట్ల ఐక్యవేదిక నాయకులు హర్షం


నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ పార్టీ మెనిఫెస్టోలో చేర్చడం పట్ల రెడ్డి ఐక్యవేదిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.  గురుకులాల ఏర్పాటు చాలా మంచి నిర్ణయమని, అగ్రవర్ణ పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని వారు తెలిపారు. అగ్రవర్ణ పేదల పిల్లల చదువు గురించి ఆలోచించి తొలి అడుగు వేసిన నాయకుడు సీఎం కేసీఆర్ యేనని ప్రశంసించారు. రైతుబీమా వల్ల ఎన్నో పేద కుటుంబాలకు ఆపదలో సీఎం కేసీఆర్ ఆసరా అవుతున్నారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోను ఆమోదిస్తున్నారని వివరించారు. 


కవితతో జరిగిన సమావేశంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి, కామారెడ్డిలోని రాజబహద్దూర్ వెంకట్రామి రెడ్డి ట్రస్టు చైర్మన్ నాగర్తి చంద్రా రెడ్డి, వైస్ చైర్మన్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి నాయకులు గంగా రెడ్డి, రమేశ్ రెడ్డి, రాం రెడ్డి, మల్లా రెడ్డి, భీమ్ రెడ్డి, నర్సా రెడ్డి, రాజ్ కుమార్ రెడ్డి, ఏలేటి రాంరెడ్డి వెల్మ మల్లారెడ్డి నవీన్ రెడ్డి నర్సారెడ్డి మధుసూదన్ రెడ్డి లింగారెడ్డి పాల్గొన్నారు.