Farmer suicide attempt Kamareddy Master Plan:  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల రోజుల నుంచి మాస్టర్ ప్లాన్ ముసాయిదాకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరో రైతు తన నిరసనలో భాగంగా ఆత్మత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. 


రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ, సంతోష్ ఇద్దరు అన్నదమ్ములు. వీరికి గ్రామంలో సర్వే నంబర్ 89 లో ఎకరం భూమి ఉంది. అయితే బాలకృష్ణకు ఇద్దరు ఆడపిల్లలు(కవలలు) మిధున, మేఘన ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు తాడ్వాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే ఇద్దరు పిల్లలు డాక్టర్ చదువు కోసం ప్రయత్నిస్తున్నారు. దానికోసం తన భాగం భూమిని బాలకృష్ణ అమ్మడానికి ప్రయత్నించగా గతంలో 70 లక్షలు పలికిన భూమి ధర ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో గ్రీన్ జోన్లో రావడంతో 20 లక్షలకు కూడా అమ్ముడు పోలేదు. దాంతో తన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని మనస్తాపం చెందిన బాలకృష్ణ గ్రామంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద గడ్డి మందును ఆపిల్ ఫిజ్జా బాటిల్ లో కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేసి ఇంటికి వచ్చి విషయం చెప్పాడు. దాంతో వెంటనే బాలకృష్ణను జిల్లా ఆస్పత్రికి తరలించారు. 


విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఆస్పత్రికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు బాలకృష్ణను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అతన్ని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా రైతు బాలకృష్ణ భార్య లక్ష్మీ మాట్లాడుతూ.. తమ భూమి మాస్టర్ ప్లాన్ లో గ్రీన్ జోన్లో పోతుందని తెలిసి తన భర్త ఆవేదనకు గురయ్యాడన్నారు. గత నెల రోజులుగా రైతులతో కలిసి ఉద్యమంలో కూడా పాల్గొంటున్నాడని తెలిపింది. తమ భూమి మాస్టర్ ప్లాన్ లో పోకుండా చూడాలని ఆమె వేడుకుంది.


కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ రగడ కొనసాగుతోంది. అన్నదాతలు ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమం వీడేది లేదంటున్నారు. సంక్రాంతి పండుగను సైతం లెక్క చేయకుండా మున్సిపల్ కార్యాలయం ఎదుట ముగ్గులు వేసి నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా పాలిటిక్స్ లో మాస్టర్ ప్లాన్ ఇష్యు అధికార పార్టీకి తల నొప్పిగా మారింది. మాస్టర్ ప్లాన్ పై అధికార పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ క్లారిటీ ఇచ్చినా అన్నదాతలు ఏ మాత్రం తగ్గటం లేదు. 


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం భవిష్యత్ కార్యాచరణపై రైతులు ఇవాళ మరోమారు సమావేశo నిర్వహించారు. పాత రాజంపేట గ్రామంలో 8 గ్రామాల రైతులు అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 19 వ తేదీ సాయంత్రం వరకు విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాల్సిందేనని గడువు విధించారు. 19న మధ్యాహ్నం 3 గంటల లోపు విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాల్సిందేనని తీర్మానం చేశారు. లేకుంటే
20వ తేదీన ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి తీర్మానం చేశారు రైతులు. ఆ లోపు మున్సిపల్ లో తీర్మానం చేయించి మాస్టర్ ప్లాన్ రద్దు చేయించాలని, ముట్టడి వరకు సాగదీయకండని రైతులు ప్రకటించారు. రైతు ఉద్యమం తీవ్రతరం అయ్యేదాకా చూడొద్దని అన్నారు.


ఇప్పటికే బిజెపికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు 11 వార్డు కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్, 2 వ వార్డు కౌన్సిలర్ సుతారి రవి లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీకి రాజీనామా పత్రాలను అందజేశారు. బిజెపి కౌన్సిలర్ల రాజీనామాలతో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లకు ఒత్తిడి పెరిగింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. రాజీనామా చేయకుంటే తమ వార్డుల్లోని ప్రజలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతుతున్నారు..