కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన గురువారం ముగిసింది. అయితే శుక్రవారం కామారెడ్డి బంద్ నకు రైతులు పిలుపునిచ్చారు. కాగా,  కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అన్నదాతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయ్. కలెక్టరేట్ వద్ద బైఠాయించి రైతులు నిరనస వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు గా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు నిరసనలో పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇండస్ట్రీయల్ జోన్ చేయటం వల్ల రైతులకు పంటలు పండించుకునే వీలుండదు. రైతులకు మద్దతు గా బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తానని అన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడదామంటే సీఎం కేసీఆర్ అసెంబ్లీనే నడపటం లేదని అన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. రైతులు న్యాయమైన డిమాండ్ చేస్తున్నారని అన్నారు రఘునందన్ రావు. రైతులు ఎంతటి ఆందోళనకైనా సిద్ధమంటున్నారు. కలెక్టరేట్ వద్దే బైటాయించారు. రైతులు తమ కుటుంబాలతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

మాస్టర్ ప్లాన్ ను రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.... 

కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత కామారెడ్డి పట్టణం ప్రజల అవసరాల దృష్ట్యా అధికారులు కొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశారు. కామారెడ్డి పట్టణ పరిధిలో మౌలిక వసతుల కల్పన వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో పాత మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు. అయితే కొన్ని విలీన గ్రామాలకు చెందిన వ్యవసాయ సాగు భూములు ఇండస్ట్రీయల్, గ్రీన్ జోన్లోకి మార్చడంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.  మొదట్లో కొద్దిమంది రైతులు ఆందోళ నకు దిగారు. అధికారులు, అధికార పార్టీ నాయకుల నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. రైతులకు బీజీపీ నాయకులు మద్దతుగా నిలిచారు. రైతులు నిత్యం వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్, ఇచ్చిపూర్, అడ్లూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు.

 

రెండు పంటలు సాగు చేసుకుంటున్న రైతుల భూములను ఇండస్ట్రీయల్, గ్రీన్ జోన్లుగా ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయ్. రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతులు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గంపగోవర్ధను కలిసేందుకు వెళ్లగా ఆయ.న సమాదానంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూర్, ఇచ్చిపూర్, టేక్రియాల్, అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామాలు ఉన్నాయి.

రైతుల ఆందోళన రాజకీయ మలుపులు తిరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా నిలవడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం దీన్ని అస్త్రంగా మార్చుకుంటోంది బీజేపీ. రైతులు చేస్తున్న ఆందోళనల్లో కమలం పార్టీ నాయకులు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వెంటనే ప్రభుత్వం కొత్త మాస్టర్ ప్లాన్ మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రైతులకు మద్దతుగా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నాయకులు.