Basara RGUKT Mou With Ts Cost : టీఎస్ కాస్ట్ తో బాసర ఆర్జీయూకేటి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవ‌డం వ‌ల్ల విద్య రంగంలో శాస్త్ర, సాంకేతికతను ఉప‌యోగించుకోవ‌డం ద్వారా బోధన, పరిశోధన అవకాశాలను మరింత అన్వేషించడానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి (TS Minister Indrakaran Reddy) అన్నారు. హైదరాబాద్ లోని అర‌ణ్య భ‌వ‌న్ లో టీఎస్ కాస్ట్ (తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అఫ్ సైన్స్ & టెక్నాల‌జీ) - బాసర ఆర్జీయూకేటి మ‌ధ్య గురువారం అవగాహన ఒప్పందం జ‌రిగింది. మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి, ఆర్జీయూకేటి వైస్ ఛాన్సల‌ర్ ప్రొఫెస‌ర్ వి. వెంక‌ట ర‌మ‌ణ స‌మ‌క్షంలో ఒప్పంద ప‌త్రంపై టీఎస్ కాస్ట్ మెంబ‌ర్ సెక్రట‌రీ ఎం.న‌గేష్, ఆర్జీయూకేటి డైరెక్టర్ పి.స‌తీష్ కుమార్ ఒప్పంద ప‌త్రంపై సంతకాలు చేశారు. 


ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాలు 
ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ... ఈ అవ‌గాహ‌న‌ ఒప్పందం వ‌ల్ల టీయస్ కాస్ట్ - బాసర ఆర్జీయూకేటీ రెండూ ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాలైన  పరిశోధన, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి, నూత‌న ఆవిష్కర‌ణ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందని తెలిపారు. ప్రయోగశాల నుంచి సాంకేతికతలను జోడిస్తూ ఉమ్మడి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్  ప్రాజెక్ట్‌లను నిర్వహించడమే కాకుండా సెమినార్లు, సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి  టీయస్ కాస్ట్  ద్వారా ఆర్జీయూకేటి... యూజీ, పీజీ  విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని అశాభావం వ్యక్తం చేశారు. 
శాస్త్ర, సాంకేతికతను ఉప‌యోగించుకోవ‌డం, విద్యార్థుల్లో వీటి ప‌ట్ల మ‌రింత‌ ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతోగానో దోహ‌ద‌ప‌డుతాయని పేర్కొన్నారు. అవగాహన ఒప్పందంతో పరిశోధన కార్యకలాపాలు మెరుగుపరడతాయని, విద్యార్థులకు, అధ్యాపకులకు నూతన ఆవిష్కరణలకు ఎంతో ఉపయోగపడుతుందని  వెల్లడించారు.


కేసీఆర్ దిశా నిర్దేశంలో మెరుగైన మౌలిక వసతులు 
ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana CM KCR ) దిశానిర్ధేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌హాకారంతో బాస‌ర ఆర్జీయూకేటి (Basara RGUKT) లో మౌలిక వ‌స‌తులు ఎంతో మెరుగుప‌డ్డాయ‌న్నారు. ప్రశాంత వాతావ‌ర‌ణంలో విద్యార్థులు అభ్యసిస్తున్నార‌ని తెలిపారు. నాణ్య‌మైన విద్య‌ను అందిస్తుండ‌టంతో క్యాంప‌స్ రిక్రూట్మెంట్ తో పాటు అవుట్ క్యాంప‌స్ లో విద్యార్థుల‌కు ఉపాధి అవ‌కాశాలు పెరిగాయ‌ని తెలిపారు. ఆర్జీయూకేటి స‌హ‌కారంతో నిర్మల్ జిల్లా (Nirmal District) ను ఐటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్ గా తీర్చిదిద్దుతామ‌న్నారు. అదే విధంగా ఆర్జీయూకేటి వైస్ ఛాన్సల‌ర్ ప్రొఫెస‌ర్ వి. వెంక‌ట ర‌మ‌ణ, డైరెక్టర్ పి.స‌తీష్ కుమార్ ప‌ని తీరు బాగుంద‌న్నారు. 


అంకుర సంస్థల ఏర్పాటుకు ఆర్జీయూకేటి కృషి 
అనంత‌రం వీసీ వెంక‌ట‌ర‌మ‌ణ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల నుంచి వ‌చ్చే ఆవిష్కర‌ణ‌ల‌ను ప్రొత్సహించ‌డం, అంకుర సంస్థల ఏర్పాటుకు ఆర్జీయూకేటి కృషి చేస్తుంద‌న్నారు. దీంట్లో భాగంగానే నిర్మల్ జిల్లాలో ఆర్జీయూకేటికి అనుబంధంగా నిర్మ‌ల్ ఇన్నోవేష‌న్ హ‌బ్ (NIH) ను ఏర్పాటు చేస్తామ‌ని, నిజామాబాద్ ( Nizamabad District) తో పాటు నిర్మల్ జిల్లాలో కూడా డిజైన్  అండ్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ ఏర్పాటుకు త‌మ వంతు కృషి చేస్తామ‌ని చెప్పారు.