BRS MLA Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి తనపై, తన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఎమ్మెల్యే జోగురామన్న డిమాండ్ చేశారు. గ్రామాల్లో తిరుగుతూ తనను పరోక్షంగా హత్య చేయాలనీ పిలుపునివ్వడం, ఆ విధంగా ప్రోత్సహించడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ... కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉన్నత చదువులు చదివిన కంది శ్రీనివాస్ రెడ్డి కనీస సంస్కారం, పద్ధతి లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్న మండిపడ్డారు. 


నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా..
ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తిపై కుటుంబ పరంగా, వివాదాస్పదంగా మాట్లాడితే పెద్ద నాయకుడిని అవుతా అన్న భ్రమలో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని అన్నారు. తన ఆస్తుల గురించి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే... ఆరోపణలను ఆధారాలతో సహా రుజువు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానంలో ఆయన చేసిన ఆరోపణలు రుజువైతే రాజకీయ సన్యాసం తీసుకుని ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. రుజువు చేయని పక్షంలో తిరిగి అమెరికా పారిపోతావా కంది అని సవాల్ విసిరారు. గ్రామాల్లో తిరుగుతూ తనను పరోక్షంగా హత్య చేయాలనీ పిలుపునివ్వడం, ఆ విధంగా ప్రోత్సహించడం దారుణమని, కనీస రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 


తన గురించి, తన రాజకీయ ప్రస్థానం గురించి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు ఎమ్మెల్యే. కేవలం డబ్బులను ఎరగా చూపి వారి ఓట్లను కొనాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రజలే తిప్పి కొడతారని స్పష్టం చేశారు. తనపై చేసిన వ్యక్తిగత, నిరాదర ఆరోపణలకు గానూ పరువు నష్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. పరోక్షంగా హత్య చేయాలనీ ప్రోత్సహించడంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ఆయా గ్రామాల్లోని పోలిస్ స్టేషన్ ల పరిధిలో ఫిర్యాదులు అందిస్తామని తెలిపారు. ఇప్పటినుంచైనా కనీస సభ్యతతో మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. వారితో జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, పట్టణ అధ్యక్షులు అలాల అజయ్, అధికార ప్రతినిధి గంగారెడ్డి, కౌన్సిలర్ భరత్, రామ్ కుమార్, నాయకులు సాజిదోద్దీన్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆత్మహత్య చేసుకుంటా- జోగు రామన్న సవాల్
 ఓటుకు నోటు కేసులో దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే జోగురామన్న ధ్వజమెత్తారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటా అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా అంటూ సవాల్ విసిరారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనను, తన ఇంటి పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే... బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను కాబట్టే ఓర్వలేక అవమానిస్తున్నారని అన్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial