ఆదిలాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని, తరోడ బ్రిడ్జ్ విషయంలో వారు అనుసరిస్తున్న బీజేపీ నాయకుల అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ లో స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న జోగు రామన్న... తరోడ వంతెన గురించి అనవసర దుష్ప్రచారాలు చేయడం తప్ప అభివృద్ధికి ఎటువంటి సహకారం అందించడం లేదని అన్నారు. ఫిబ్రవరి 19 న తరోడ వంతెన కుంగిన వెంటనే ఆర్ అండ్ బీ అధికారులతో విస్తృతంగా చర్చించి నిపుణులతో పరిక్షించామని అన్నారు. సమగ్ర పరీక్షలు పూర్తి చేసిన తర్వాత వాహనాల రాకపోకలు నిషేధించాలన్న నిపుణుల సూచనల మేరకు రాకపోకలు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. 
సమస్య పరిష్కారానికి తన వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నానన్న ఎమ్మెల్యే జోగు రామన్న... ఇదే సమయంలో బీజేపీ నేతలు దుష్ప్రచారాలు ప్రారంభించి.. సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదని అన్నారు. తరోడ వంతెన జాతీయ రహదారి నిర్మాణానికి గానూ కేంద్రం పరిధిలోనే ఉన్న విషయాన్ని బీజేపీ నేతలు మర్చిపోయారని విమర్శించారు. అనేక మార్లు అధికారులతో చర్చించి కేంద్రానికి నివేదిక పంపితే నీరాల నుండి ఆదిలాబాద్ వరకు రహదారి నిర్మాణానికి (CRIF) నిధులు మంజూరు అయినట్లు వివరించారు. రాష్ట్రం నుండి కేంద్రానికి కట్టే పన్నులు, సెస్సుల రూపంలో జమ ఉంచే నిధులే (CRIF) నిధులని స్పష్టం చేసిన ఆయన... ఆ నిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపితేనే విడుదల అయ్యాయని స్పష్టం చేశారు. CRIF యాక్ట్ గురించి కనీస అవగాహనా లేకుండా బీజేపీ నాయకులూ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదికలు వెళ్ళందే CRIF నిధులు మంజూరు కావని, అవి కుడా రాష్ట్రం ద్వార కట్టిన పన్నుల జమనేనని పేర్కొన్నారు. 


తమ కృషి కారణంగానే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. కనీసం ఒక్కసారి కుడా ఎంపీ తరోడ వంతెన వరకు రాలేదని మండిపడ్డారు. ఉపాసనాల నుండి బోరజ్  వరకు మంజూరు అయిన జాతీయ రహదారి నిర్మానానికి ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్న ఆయన.. ఆ విషయంపై బీజేపీ నాయకులూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. సిసిఐ పునరుద్ధరణ, గిరిజన యూనివర్సిటీ, ఎయిర్ స్ట్రిప్, కేంద్రీయ విద్యాలయం వంటి అంశాలపై కేంద్రం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం వారి చిత్తశుద్దికి నిదర్శనమని స్పష్టం చేశారు. వారితో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, జిల్లా రైతు సమితి అధ్యక్షులు రోకండ్ల రమేష్, వైస్ చైర్మన్  జహీర్ రంజాన్, ఎంపీపీ గండ్రత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.