RS Praveen Kumar: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిధిలోని కోయపోషగూడ ఆదివాసీలపై అటవీ అధికారుల దాడి అమానుషం అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోయపోషగూడలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి దాడికి గురైన ఆదివాసీ మహిళలను ఆయన పరామర్శించారు. వర్షంలో తడుస్తూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. వారి బాధలను ఎంతో ఓపికగా విన్నారు.


రాత్రి వారితో కలిసి కూర్చొని చలి మంటలు వేసుకొని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వారు తినే ఆహారాన్నే వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఆదివాసీలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తామని చెప్పి మాట తప్పాయని విమర్శించారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఆదివాసీలను జంతువుల కంటే హీనంగా లాక్కెళ్లడం దారుణమని అన్నారు. ఆదివాసీలు బతుకుదెరువు కోసం పంటలను సాగు చేస్తున్నారే తప్ప వ్యాపారం కోసం భూములను లే ఆవుట్లు వేసి అమ్ముకోవడం కోసం కాదని అన్నారు. 


బహుజన రాజ్యంలో ప్రతి పేదకు ఎకరం భూమి కల్పిస్తామని అన్నారు. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామన్నారు. బుక్కడె బువ్వకోసం వారు పడే తాపత్రయం అధికారులకు కన్పించలేదా, ఈ ఆదివాసి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం కల్పించిన హక్కులేంటి, దొరల గడీల పాలన అంతం చేసే రోజు దగ్గరగానే ఉందని, తెలంగాణ మీదే కాదు తెలంగాణ ప్రజలందరిది, రానున్నది బహుజనుల రాజ్యమని అన్నారు.






‘‘అన్ని ప్రభుత్వాలకు ఆదివాసులు లోకువే. అసలు ఈ దేశానికి నిజమైన మూలవాసులు ఆదివాసి గిరిజనులే. వాళ్ల మీదనే ఈ దోపిడి దొరల ప్రభుత్వాలు ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నై. వారి మాటల్లోనే వినండి. ఆదివాసి బాలలకు కనీసం కొంచెం కూడా పౌష్టికాహారం దొరకడం లేదు, ఉండడానికి సరైన గూడు లేదు, పైగా పోలీసు ఫారెస్టు ఆఫీసర్ల దౌర్జన్యాలు.ఎన్నో తరాలుగా అటవీ భూమిని నమ్ముకున్న వీళ్లకు పోలీసు-ఫారెస్టు కేసులు దైనందిన జీవితంలో భాగమైనవి. బహుజన రాజ్యంలో వీటన్నింటినుండి వీళ్లకు విముక్తి కల్పిస్తాం.’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరుస ట్వీట్లు చేశారు.