Dharmapuri Arvind - ఈసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ రానుందా ?
- రాష్ట్రం నుంచి అర్వింద్ పేరుందనే ప్రచారం


తక్కువ కాలంలో తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా లోక్ సభకు ఎన్నికైన ఎంపీ అరవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ టీంలో అవకాశం దక్కనుందా ? అంటే పార్టీ వర్గాల నుంచి సానుకూలంగా సమాధానం వస్తోంది. పార్టీ కీలకనేతలు అవుననే అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నిజమైతే నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రలోనే కొత్త రికార్డు నమోదు కానుంది. ఇప్పటికే తొలి బీజేపీ ఎంపీగా ఎన్నికైన అర్వింద్ కొత్త రికార్డును సృష్టించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన అర్వింద్ కు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కితే అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకుంటారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజవర్గం నుంచి  కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తొలి ఎంపీగా ఘనతను అర్వింద్ కు దక్కినట్లవుతుంది. 
అర్వింద్ ఎంట్రీ తర్వాత మారిన పరిస్థితి
రాజకీయాల్లో అర్వింద్ ఎంట్రీ తర్వాత జిల్లాలో పరిస్థితి మారిపోయింది. ఒకే ఒక్కడుగా జిల్లా బీజేపీని తనదైన ముద్ర వేసుకున్నారు. ఒకవైపు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తూనే... మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఎంపీ అరవింద్. దాదాపు మూడున్నర ఏళ్ల కాలం ముగిసిపోగా, ఎంపీగా మరో ఏడాదిన్నర కాలం పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అర్వింద్ కు కేంద్ర మంత్రి వర్గంలో సహాయమంత్రిగా అవకాశం దక్కనుందనే చర్చ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత మంత్రివర్గ విస్తరణలోనే అర్వింద్ కు అవకాశం వస్తుందని భావించినప్పటికీ సహాయమంత్రి నుంచి క్యాబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డికి ప్రమోషన్ దక్కింది. రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, బాబురావు, అర్వింద్ లు బీజేపీ ఎంపిలుగా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా తొలిసారి ఎంపీగా ఎన్నికైనవారే. సీనియారిటీ లెక్కన కిషన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది.


కేంద్ర అధిష్టానం దృష్టిని ఆకర్షించిన ఎంపీ అర్వింద్ 
కేంద్ర మంత్రిగా అవకాశం దక్కితే ? జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అర్వింద్ కీలకంగా మారనున్నారు. తమదైన శైలిలో ప్రసంగిస్తూ... ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అర్వింద్ కేంద్ర అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అర్వింద్ కు కీలకమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా చర్చ జోరుగా సాగుతుంది. ఇదే నిజమైతే నిజామాబాద్ పార్లమెంట్ చరిత్రలో అరవింద్ ఓ రికార్డును నమోదు చేస్తారు.  ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. బీజేపీ నుంచి తొలిసారి ఎంపికైన లోకసభ సభ్యుడిగా అరవింద్ ఇదివరకే రికార్ద్ నమోదు చేసుకున్నారు.


 తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం వచ్చే ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన కాపు సామాజికవర్గం నుంచి అరవింద్ కు మంత్రి పదవి దక్కితే పార్టీకి మరింత మైలేజ్ వచ్చే అవకాశాలున్నాయని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. అరవింద్ కు కేంద్ర మంత్రి పదవి దక్కితే... యూత్ లో కూడా మరింత క్రేజ్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు అరవింద్ సామాజిక వర్గానికే చెందిన లక్ష్మణ్ పేరు కుడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.