కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన GO.NO.49ను. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (సోమవారం) తలపెట్టిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ ను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు, ప్రజాస్వామి కవాదులకు, చిరు వ్యాపారులకు, వాణిజ్య వర్తక వ్యాపారులకు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలు సహకరించాలని కోరారు. 

బంద్‌కు అంతా సహకరించాలని తుడుందెబ్బ విజ్ఞప్తి

ఆదిలాబాద్ తో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోను అన్ని మండలాల్లో నాయకులు.. వాణిజ్య వర్తక వ్యాపారులకు, అందరికి బంద్ కు సహకరించాలని తుడుం దెబ్బ నాయకులు విజ్ఞప్తి చేశారు. తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పేసా, ఆదివాసి చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల మనుగడను ఆదివాసిల హక్కులను జీవోలను ఉల్లంఘిస్తూ ఏటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన GO.NO.49 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రోజున ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ, ఆదివాసి సంఘాలు పిలుపునివ్వడం జరిగిందన్నారు. 

బంద్‌ను విజయవంతం చేయండి

ఈ బందుకు  అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వర్తక, చిరు వ్యాపారులు ప్రైవేట్ స్కూల్ కాలేజీల యాజమాన్యాలు, సినిమా ధియేటర్లు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో బంద్ చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ బందులో అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు యువజన, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు, ఆయా రాజకీయ పార్టీల ప్రజలు, మేధావులు బుద్ధి జీవులు, కార్మిక కర్షక వర్గాల ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. 

వారితో పాటు తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపధ్యక్షురాలు ఉయిక ఇందిర, డివిజన్ ఉపాధ్యక్షులు ఆత్రం గణపతి, ఆదివాసీ మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు సోయం లలిత బాయి, మావల మండల అధ్యక్షులు వేడమ ముకుంద్, ఉపాధ్యక్షులు తోడసం ప్రకాష్, కుమ్ర గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.