దైవ దర్శనానికి భక్తులతో వెళ్తున్న డీసీఎం ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 35 మంది గాయపడ్డారు. బడా పహాడ్ దర్గాకు వెళ్తున్న టైంలో దుర్ఘటన జరిగింది. వీరంతా జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు.

 

ఓ కుటుంబ సభ్యులంతా మొక్కులు తీర్చుకునేందుకు బడా పహాడ్ దర్గాకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు డీసీఎం వ్యాన్ బోల్తా కొట్టి, 35 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, చందూరు గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

 

జగిత్యాల జిల్లా రుద్రంగి మండలం, మానాల గ్రామానికి చెందిన ముదిరాజు సాయిలు, అనే వ్యక్తి బడా పహాడ్ లో మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి డీసీఎం వ్యాన్ లో వెళ్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చందూరు శివారులో డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా బోల్తా కొట్టింది.

 

ఈ ప్రమాదంలో వ్యాన్ లో సుమారు 60 మంది వరకు భక్తులు ఉండగా, అందులో 35 మంది గాయాలపాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వర్ని పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులని హుటాహుటిన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు.

 

ప్రస్తుతం గాయాల పాలైన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వర్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీఎం వ్యాన్ బోల్తా బోల్తా కొట్టడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. గాయాలైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ప్రాణహాని మాత్రం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.