Minister Vemula Prashanth Reddy : దేశంలో బీజేపీ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని నిలువునా దోచుకుతింటున్న పార్టీ బీజేపీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ఎవరికి లాభం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పైగా కేసీఆర్ ప్రభుత్వం చేసే మంచి పనులపై బీజేపీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు పల్లెలకు వస్తున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో గమనించాలన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి 3 లక్షల 70 వేల కోట్లు పన్నుల రూపంలో కడితే కేంద్రం ఇచ్చింది కేవలం 1 లక్ష 70 వేల కోట్లు మాత్రమే అని, మిగతా సొమ్మంతా బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంత్రి ఆరోపించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత డాలర్ తో రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనివిధంగా క్షీణించిందని అన్నారు. మోదీ వచ్చిన కొత్తలో 56 రూపాయలకు 1 డాలర్ ఉంటే..ఇపుడు 83 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. మోదీ వచ్చిన కొత్తలో నిరుద్యోగ రేటు 5.4 శాతం ఉండే..ఇపుడు 7శాతానికి పెరిగిందన్నారు. పెట్రోల్ ధర రూ.60  ఉండే ఇప్పుడు రూ.110 దాటిందని, డీజిల్ ధర 45 నుంచి రూ.100  దాటిందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.450 నుంచి రూ.1200కు పెరిగిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. 


చైనాతో పెట్టుకోలేం అని మాట్లాడడం సిగ్గుచేటు


రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మోదీ కన్నా ముందు ఉన్న 13 మంది ప్రధానులు 55 లక్షల కోట్ల అప్పు చేస్తే మోదీ ఒక్కరే 8 ఏళ్లలో 100 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. మరోవైపు చైనా మన దేశ సరిహద్దులు దాటి వస్తున్న ఏమి చేయలేకపోతున్నారని, విదేశాంగ మంత్రి బాధ్యతారాహిత్యంగా చైనాతో ఇప్పుడు పెట్టుకోలేం అని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. అసలు దేశ రక్షణ గాలికి వదిలేశారని, మోదీ దేశం కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు చిన్న లోన్ తీసుకుంటే బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తాయి కానీ మోదీ తన కార్పొరేట్ మిత్రులు తీసుకున్న 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారన్నారు. ఎవడబ్బ సొమ్మని తమ కార్పొరేట్ మిత్రులకు మేలు చేసి దేశ ప్రజల మీద భారం వేశారని నిలదీశారు. అప్పనంగా వచ్చిన రూ.12 లక్షల కోట్లను బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ఖర్చు చేస్తున్నారన్నారు. అలా ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు. 


ఎల్ఐసీకి రూ.40 వేల కోట్ల నష్టం 


వేల కోట్ల ఎల్ఐసీ ప్రీమియం డబ్బులను కూడా పక్కదోవ పట్టించిన ఘనత మోదీ ప్రభుత్వానిదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అదానీ కేవలం 8 ఏళ్లలో 45 వేల కోట్ల నుంచి 11లక్షల కోట్లకు పడగలెత్తిండు ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. హిండేన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ మోదీ దోస్త్ అవినీతిని బయటపెట్టిందని అన్నారు. ఒక్క ఎల్ఐసీ సంస్థనే అదానీ వల్ల 40 వేల కోట్లు నష్ట పోయిందని అదంతా ప్రజలసొమ్మని అన్నారు. నిజంగానే ప్రధాని మోది సచ్చీలుడైతే అదానీపై సీబీఐ,ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన అందరిపై సీబీఐ ప్రయోగిస్తున్నారని..రేపు తనలాంటి వారి పై కూడా వేధింపులు ప్రారంభిస్తారని అన్నారు. కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవితా జైల్ కు వెళ్తుందని ఒక మామూలు బీజేపీ ఎంపీ ఎలా డిసైడ్ చేస్తారని నిలదీశారు. 2జీ స్ప్రెక్టం రూ.1.70 లక్షల కోట్లకు అమ్ముడు పోతే ఆ విషయంలో అవినీతి జరిగిందని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోల చేసిన మోదీ..15 ఏళ్ల తర్వాత 5జీ స్పెక్ట్రం రూ.1.48 లక్షల కోట్లకే అమ్మి 10 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. రుణమాఫీ, 5జీ స్పెక్ట్రం లాంటి రెండు కేసుల్లోనే మోదీ,అమిత్ షా దాదాపు 22 లక్షల కోట్ల అవినీతి చేశారని అన్నారు. అక్రమంగా వచ్చిన డబ్బులు వెదజల్లుతూ స్వైర విహారం చేస్తున్నారని, వినకుంటే తప్పుడు కేసులలో వేధిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అవినీతిని ప్రశ్నిస్తున్న కేసీఆర్ కుటుంబంపై పడ్డారని, ఆయన కూతురు ఎమ్మెల్సీ కవితను జైల్ కు పంపిస్తామని ఒక సాధారణ బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు వీరి ఆగడాలు అన్ని గమనిస్తుందని, అవినీతి బీజేపీ నేతలకు బేడీలు తప్పవని హెచ్చరించారు. 


ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏమైంది? 


ఎంపీ అరవింద్ నోరు విప్పితే అబద్ధాలు, బూతులు మాట్లాడుతారు తప్పా ఆయన వల్ల ఒరిగింది ఏం లేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. తాను బాల్కొండలో 10 వేల మందికి 40 కోట్ల రూపాయలు  ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా అందించాననీ, దమ్ముంటే ప్రధాన మంత్రి సహాయనిధి కింద నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. ఎంపీ అర్వింద్ కు దమ్ముంటే గ్రామాల్లో పర్యటించే ముందు ఆ ఊరికి ఏమి ఇచ్చారో, కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో ఏమీ అభివృద్ధి చేశారో చెప్పి ఆ గ్రామంలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి గెలిచి రైతులను మోసం చేసిన అర్వింద్, ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే పసుపు పరిశ్రమ తెస్తానని సిగ్గులేకుండా చెప్తున్నాడని దుయ్యబట్టారు.