Telangana New Railway Line: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినందున హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. ఖమ్మం జిల్లా మోటుమర్రి, నల్గొండ జిల్లా విష్ణుపురం మధ్య రైల్వే రెండో లైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు రైళ్లు తక్కువ సమయంలోనే చేరుకునే వెసులుబాటు కలగనుంది. 88.81 కి.మీ రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి రూ.1,746.40 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం విష్ణుపురం నుంచి మోటుమర్రి వరకు గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో రెండో రైలు మార్గాన్ని నిర్మించి ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించాలని కేంద్రం నిర్ణయించింది.


టైం సేవ్


ఇప్పటివరకూ ప్రయాణికులు కొన్ని రైళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి గుంటూరు వెళ్లి విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. సికింద్రాబాద్ నుంచి 313 కి.మీలు దూరం ఉండగా.. బీబీనగర్ - గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండడంతో ప్రయాణికులు రైలులో ప్రయాణించాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అయితే, మోటుమర్రి మార్గంలో రెండో లైన్ ఏర్పాటు చేస్తే గుంటూరు వెళ్లకుండా నేరుగా విజయవాడ చేరుకోవచ్చు. ఈ మార్గం ద్వారా దాదాపు 50 కి.మీ దూరం తగ్గించి గంట సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. 2011లో సిమెంట్ పరిశ్రమల వాణిజ్య అవసరాల కోసం విష్ణుపురం నుంచి మోటుమర్రి వరకూ రైల్వే లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 24 గూడ్స్ రైళ్లు నడుపుతూ.. సిమెంట్, ఇనుము, బియ్యం రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకే మార్గంలో ఇన్ని గూడ్స్ ట్రైన్లు నడుస్తుండగా.. ట్రాఫిక్ పెరిగి సమయం వృథా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రెండో లైన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని గతంలోనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మార్గంలో రెండో లైన్ ఏర్పాటైతే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం.. ఏపీలోని పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది.


Also Read: Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం- హామీల అమలుపై ఫోకస్ అన్న భట్టి